సిద్దిపేట, మార్చి 21: ప్రేమించి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత తనను మోసం చేశాడని ఇమాంబాద్కు చెందిన అంబిగల్ల స్వాతి న్యాయం చేయాలని ప్రియుడు గొడుగు గణేశ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. గణేశ్, స్వాతి చాలాకాలం ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్వాతిని శారీరకంగా వాడుకుని గర్భిణీని చేసి తనకు సంబంధం లేదని వదిలేశాడు. బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి సిద్దిపేట వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు కోర్టులో ఉండగానే బాధితురాలు స్వాతి బిడ్డకు జన్మనిచ్చింది. డీఎన్ఏ టెస్టు చేయించడంతో బిడ్డకు గణేశ్ తండ్రి అని నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు పెండ్లి చేసుకోమంటే తనను ఇబ్బంది పెడుతున్నారని, తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని ఆమె కోరారు. గురువారం మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రేమికుడి ఇంటి ఎదుట స్వాతి బైఠాయించారు.