మెదక్ అర్బన్/సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 27: వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుంగా జాగ్రత్తలు పాటించాలన్నారు. శనివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వినాయక ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్య వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందిస్తే సమస్య పరిష్కరిస్తామన్నారు.
వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకునే వారు వెబ్ సైట్లో ఆన్లైన్లో అనుమతులకు http/policeportal. tspolice.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ వారి అనుమతి కూడా తప్పనిసరి అన్నారు. గణేశ్ మండపాలను నాణ్యత కలిగిన వస్తువులతో ఏర్పాటు చేయాలన్నారు. వివాదాస్పద ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటుచేయకూడదన్నారు. మండపాల వద్ద ముగ్గురు వలంటీర్లు ఉండాలన్నారు. మండపాల వద్ద టపాకాయలు, మందు గుండు సామాగ్రి ఉంచరాదన్నారు. విగ్రహ ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం పూర్తయ్యేంత వరకు సంబంధిత ఆర్గనైజర్లు పూర్తి బాధ్యత వహించాలన్నారు. గణేశ్ మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీలు హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మండపాల వద్దకు వచ్చే భక్తులు మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.