గజ్వేల్ అర్బన్, జనవరి 11: గులాబీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వల్లనే నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్సీ సంతోష్గుప్తా అన్నారు. గజ్వేల్లో గురువారం సాయంత్రం 49వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలను కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, కబడ్డీ మహిళా కమిషన్ చైర్పర్సన్ దండుగల రాజ్యలక్ష్మితో కలిసి వారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ క్రీడా పతకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించి అతిథులకు గౌరవవందనం సమర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పలువురు మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ వల్లనే గజ్వేల్ నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు. కేసీఆర్ ప్రాతినిథ్యం వహించిన నాటి నుంచే ఎన్నో రాష్ట్ర స్థాయి క్రీడలకు గజ్వేల్ ఆతిథ్యమిచ్చిందన్నారు. గజ్వేల్లో క్రీడాహబ్ ఏర్పాటుకు 22 ఎకరాలు కేటాయించిందని, ఉడెన్ బ్యాడ్మింటన్ కోర్టు నిర్మించామన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్, కబడ్డీ అసోసియేషన్, ఒలింపిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, స్థానిక కౌన్సిలర్ శ్యామల, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, బొగ్గుల చందు, శిరీష, నాయకులు, వివిధ జిల్లాల క్రీడాకారులు, పీఈటీలు పాల్గొన్నారు.