చేగుంట,అక్టోబర్ 12 : ఉరుకులు పరుగుల జీవితంలో మనిషి ఆరోగ్య సంరక్షణను నిర్లక్ష్యం చేస్తుండడంతో అనేక రకాల జబ్బుల బారినపడుతున్నాడు. దీంతో పాటు ఆహారపు ఆలవాట్లలో మార్పులు సైతం మనిషిని అనేక రుగ్మతలకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగా మనిషికి సంజీవనిలా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో అనేక మంది యోగా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక సంస్థలు, ఫౌండేషన్లు, గురువుల ద్వారా యోగా శిక్షణ ఇస్తున్నారు.
మెదక్ జిల్లా చేగుంటలో ‘జీవనమంత్ర యోగా ఫౌండషన్’ ఆధ్వర్యంలో ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నారు. ప్రజారోగ్యమే లక్ష్యంగా జీవనమంత్ర యోగా ఫౌండేషన్ శిక్షకులు, పీఈటీ అల్లీ నరేశ్ నిత్యం ఉదయం 6గంటల నుంచి7 వరకు చేగుంటలో యోగా శిక్షణ ఇస్తున్నారు. యోగా చేయడంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ యోగా చేయిస్తూ ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ యోగా శిక్షణ ఇచ్చి మానసిక ప్రశాంతత పొందడం, సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేస్తున్నారు. రెండేండ్లుగా ఉచిత యోగా శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. కరోనా సమయంలో తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటుఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కాకినాడ ప్రజలకు ఆన్లైన్లో యోగాసానాలు,ప్రాణాయామం శిక్షణ తరగతులు నిర్వహించారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 కోట్ల సూర్య నమస్కారాలు భాగంగా గత జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 21వరకు ప్రతి రోజు వంద మందితో 13 రకాల సూర్య నమస్కారాలతో 75 కోట్ల సూర్యనమస్కారాల్లో యోగా గురువు నరేశ్ భాగస్వామ్యం చేశాడు.
75 నమస్కారాల దృశ్యమాలిక పోస్టర్ …
యోగా గురువు నరేశ్ చేసిన 75రకాల యోగా సనాలు, సూర్య నమస్కారాలకు సంబంధించిన పోస్టర్ను మెదక్ ఆదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎస్పీ రోహిణి ప్రయదర్శిని, డీఈవో రమేశ్కుమార్ ఇటీవల విడుదల చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2021 ఉగాది పురస్కారాల్లో సినారె కళామందిరంలో లంబోదరా కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు.
థైరాయిడ్ సమస్యతో బాధపడేవాన్ని..
నేను చాలాకాలంగా థైరాయిడ్ సమస్యతో బాధపడ్డా. ఆరు నెలలుగా ఉదయం గంట సేపు యోగా శిక్షణ తరగతులకు హాజరవుతున్నా. థైరాయిడ్ పరీక్షలు చేయించుకున్నా. యోగా చేయడం ద్వారా నాకు నార్మల్గా రిపోర్టు వచ్చింది.
– గందె ప్రశాంత్, వ్యాపారి, చేగుంట
ఉచిత శిక్షణతో సంతృప్తి..
ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఉచితంగా యోగ శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉంది. అనేక మంది వివిధ సమస్యలతో నావద్దకు వచ్చి బాధపడుతున్నారు. వారికి యోగాతో పరిష్కార మార్గాలు చూపుతున్నా. వ్యాయామ విద్యపై ఉస్మానియా యూనివర్సిటీలో సూర్యనమస్కారాల పోస్టర్ను ప్రదర్శించాం. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్కుమార్, ప్రొఫెసర్ దీప్ల ఆధ్వర్యంలో వివరించాం.
– అల్లి నరేశ్, జీవన మంత్రి యోగా ఫౌండేషన్ శిక్షకుడు, చేగుంట