మెదక్, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ: కోర్టుకు వెళ్తే సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కక్షిదారుల్లో కలిగేలా న్యాయ వ్యవస్థ పని చేయాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. శనివారం మెదక్ కోర్టు సముదాయంలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడో అంతస్తు భవన నిర్మాణానికి రాష్ట్ర హైకోర్టు జడ్జిలు జస్టిస్ నవీన్రావు, జస్టిస్ సంతోష్రెడ్డి, మెదక్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి లక్ష్మీశారద, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జెన్నారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మాట్లాడుతూ కేసులు త్వరితగతిన పరిషారం కావాలన్నారు. 25 నుంచి 30 ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉండడం మంచిది కాదన్నారు. న్యాయ వ్యవస్థకు బార్, బెంచ్ రెండు చక్రాల వంటివని, రెండు సక్రమంగా పని చేస్తేనే కేసులు సత్వర పరిషారమై కక్షిదారులకు న్యాయం చేకూర్చినవారవుతామన్నారు. మౌలిక వసతులు సక్రమంగా ఉన్నప్పుడే కోర్టుల నిర్వహణ సజావుగా సాగుతుందన్నారు. రాష్ట్రంలోని కోర్టులకు బిల్డింగ్లు, మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్కు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జెన్నారెడ్డి వినతి పత్రం అందజేశారు. మొబైల్ కోర్టును అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టుగా అప్ గ్రేడ్ చేయాలని, 10 ఎకరాల్లో కోర్టు సముదాయం ఉన్నందున వాంగల్లో రూ.33 కోట్లతో చేపడుతున్న మోడల్ కోర్టు సముదాయం లాగే ఇకడ ఆఫీసర్స్ క్వార్టర్స్, కోర్టు కాంప్లెక్స్ నిర్మించాలని ఆ వినతి పత్రంలో కోరారు.
మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
అనంతరం మెదక్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసి చర్చి విశిష్టతను పాస్టర్ ద్వారా తెలుసుకున్నారు. ఆ తరువాత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పాలక మండలి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేసి, సన్మానించారు. కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీవీ.ప్రసాద్రావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, ఈవో సారా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.