ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన గృహలక్ష్మి పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల చొప్పున ఇండ్లు కేటాయించి దశలవారీగా మంజూరు చేయనున్నది. మొదటి విడుత కోసం ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కలెక్టరేట్లు, ఎంపీడీవో, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయగా, ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి క్యూలో నిలబడి సంబంధిత పత్రాలు సమర్పించారు. సంగారెడ్డి జిల్లాకు 14250 ఇండ్లు కేటాయించగా, శుక్రవారం నాటికి 44620 అప్లికేషన్లు వచ్చాయి. మెదక్ జిల్లాకు 6000 ఇండ్లు మంజూరు కాగా 20,616 దరఖాస్తులు వచ్చాయి. ప్రజల నుంచి ఊహించిన దానికంటే అధికంగా స్పందన రావడంతో ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-సంగారెడ్డి/మెదక్ (నమస్తే తెలంగాణ) ఆగస్టు11
సంగారెడ్డి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. ఇంటి స్థలం ఉన్న వారు ఇల్లు నిర్మించుకునేందుకు ఈ పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. దీంతో ప్రజల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 8 నుంచి అధికారులు ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇందుకోసం తహసీల్ కార్యాలయాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాకు 14,250 ఇండ్ల నిర్మాణల కోసం నిధులు కేటాయిస్తుండగా, ప్రతి నియోజకవర్గానికి 2వేల నుంచి 3వేల వరకు ఇండ్లను మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 44,620 దరఖాస్తులు రాగా, అత్యధికంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 15,212 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు లేదు. ఇంటి స్థలం ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చు. ఈ దరఖాస్తుల ఆధారంగా అధికారులు క్షేత్రస్థాయిలో వి చారణ జరిపి అర్హులకు రూ.3 లక్షలు మూడు వి డతలుగా ఆర్థిక సాయం అందజేయనున్నారు. ముందుగా బేస్మెంట్ లెవల్లో రూ.లక్ష, రూఫ్ లెవల్లో మరో రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయ్యే సమయంలో రూ.లక్ష అందజేయనున్నారు.
గృహలక్ష్మి పథకానికి సంగారెడ్డి జిల్లాలో అనూహ్య స్పందన లభిస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 44,620 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 15,212 దరఖాస్తులు వచ్చాయి. అందోల్లో 7358, నారాయణఖేడ్లో 6558, పటాన్చెరులో 6217, సంగారెడ్డి నియోజకవర్గంలో 5451, హత్నూర మండలంలో 3824 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా, ఆ సంఖ్య మరింత పెరగనున్నది. అర్హులైన వారిని గుర్తించటంతోపాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి లబ్ధిదారులను గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.
మెదక్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): నిరుపేదల ఆకాంక్షను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద సొంగ జాగా ఉన్నవారు ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షల సాయం అందించనున్నది. ఈ పథకం కోసం మెదక్ జిల్లాలో 20,616 దరఖాస్తులు వచ్చాయి. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, నిర్ణీత గడువు లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటిస్తున్నా మొదటి దశలోనే సాయం పొందాలని అనుకున్న ప్రజలు దరఖాస్తులు పెట్టుకునేందుకు తహసీల్, మున్సిపల్ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద బారులు తీరారు. సంబంధిత దరఖాస్తులతో పాటు కావాల్సిన సర్టిఫికెట్ల కోసం ఆర్జీలు పెట్టుకునే వారితో మీ సేవ కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3వేల ఇండ్లను మంజూరు చేసింది. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, మిగిలిన మండలాలు ఆయా నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. అయితే జిల్లాకు సుమారు 6వేల వరకు ఇండ్లు మంజూరుకానున్నాయి. అందోల్ నియోజకవర్గంలో టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గం మండలాలు ఉండగా, దుబ్బాక నియోజకవర్గంలో చేగుంట, నార్సింగి మండలాలు, గజ్వేల్ నియోజకవర్గంలో తూప్రాన్, మనోహరాబాద్ మండలాలు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి.
ఇండ్ల మంజూరు, బిల్లులకు సంబంధించిన ప్రక్రియ ఆన్లైన్లోనే కొనసాగుతున్నది. సామాజిక వర్గాల వారీగా గృహలక్ష్మి పథకంలో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తున్నది. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలు, మైనార్టీలకు 50 శాతం, వికలాంగులకు 5 శాతం వరకు ఇవ్వనున్నారు.
సొంత జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథం కింద రూ.3 లక్షలు మంజూరు చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరు కాగా, దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. పేదల ఇంటి కలను సాకారం చేయడానికే గృహలక్ష్మి పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రతి పక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ఈ పథకం ఆగదు.
– పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే