రామచంద్రాపురం, మార్చి 2: గుడిసెలో నిద్రిస్తున్న వారిని మృత్యువు లారీ రూపంలో వచ్చి కబళించింది. కొల్లూర్ ఓఆర్ఆర్పై లారీ అదుపు తప్పి ర్యాంప్ పైనుంచి కిందనే ఉన్న గుడిసెపైకి దూసుకురావడంతో అందులో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలను విడిచారు. వివరాల్లోకి వెళ్లితే.. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ ఔటర్ రింగురోడ్డు వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొల్లూర్ టోల్గేట్ ప్లాజా వద్ద రింగురోడ్డుపై చెట్లకు నీరు పోసే కార్మికులు గుడిసెలు వేసుకొని అందులోనే నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రైస్లోడ్తో హర్యానా నుంచి చిత్తూరు వెళ్తున్న లారీ కొల్లూర్ సమీపంలోకి రాగానే అదుపు తప్పి ర్యాంప్ పైనుంచి గుడిసె మీదకు దూసుకువచ్చింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న కర్ణాటక రాష్ట్రం యాద్గీర్ జిల్లాకు చెందిన బాబు రాథోడ్ (48), కమలీ బాయి (43), బసప్ప రాథోడ్(23) అక్కడికక్కడే మృతిచెందారు. వీరు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ ఘటనతో పక్కనే నిద్రిస్తున్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం రావడంతో ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్, ఎస్సై శశికాంత్రెడ్డి, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజమహమ్మద్, ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి లారీని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. గుడిసెలోని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి సొంత గ్రామానికి పంపించారు. ఒకే కుటుంబానికి చెందినవారు మృతి చెందడం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది.
లారీ డ్రైవర్ ముబారక్ నిర్లక్ష్యమే కారణం…
తెల్లవారుజామున సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో లారీ అదుపు తప్పి ప్రమాదానికి కారణమైందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న కొల్లూర్ స్థానిక నాయకులు రాజుగౌడ్, రామ్సింగ్ తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ నర్సింహరావు పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం..
కొల్లూర్ ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి వచ్చారు. ప్రమాదం జరిగిన తీరుని ఇన్స్పెక్టర్ సంజయ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడి మృతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మృతుల కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50 వేలు అందజేశారు. పోస్టుమార్టం త్వరగా చేయించి స్వస్థలానికి పంపించాలని పోలీసులకు ఆదేశించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు. ఈ ఘటనపసై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.