దుబ్బాక టౌన్, మార్చి 4 : కాల్వలు పూర్తి చేసి నీరు అందించాలంటూ దుబ్బాక, చెల్లాపూర్, మల్లాయిపల్లి, కమ్మరపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చెల్లాపూర్ సమీపంలోని మల్లన్నసాగర్ ప్రధాన కాల్వ వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నీళ్లు వస్తాయన్న ఆశతో పంటలు సాగుచేసుకుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కాల్వలను దుబ్బాక ప్రాంతానికి తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 50 అడుగుల దూరం కాల్వను తవ్వించలేదని ఆరోపించారు.
కాల్వను తవ్వించి ఉంటే మల్లాయిపల్లి, కమ్మరపల్లి, అచ్చుమాయిపల్లి, పోతారం, చీకోడ్, ఆరేపల్లి గ్రామాల్లోని పొలాలకు సాగునీరు అందేదన్నారు. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మల్లన్నసాగర్ నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్, పుష్కలంగా నీళ్లు ఇచ్చారని రైతులు గుర్తుచేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 గంటల పాటు సరైన కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. నిరసన సమయానికి అక్కడికి వచ్చిన కాంట్రాక్టర్తో రైతులు వాగ్వాదానికి దిగారు. సుమారు గంటపాటు రోడ్డు పై బైఠాయించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.