గజ్వేల్/ గజ్వేల్ అర్బన్, డిసెంబర్ 12: హైదరాబాద్లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ను చూసేందుకు మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కొంతకాలం కేసీఆర్ దవాఖానలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఆయనను కార్యకర్తలు కలువలేకపోయారు. దవాఖాన వద్ద పెద్దసంఖ్యలో వేచి ఉన్న కార్యకర్తలను మాజీ మంత్రి కేటీఆర్ కలిసి విషయం చెప్పడంతో అందరూ వెనుతిరిగి వచ్చారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో గజ్వేల్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. దవాఖాన వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు జరిగిన ఘటనతో దవాఖానలో చేరిన కేసీఆర్ను చూసేందుకు పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారన్నారు. గజ్వేల్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన కేసీఆర్ త్వరగా కోలుకోవాలన్నారు. తరలివెళ్లినవారిలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, కౌన్సిలర్లు లక్ష్మీకిషన్రెడ్డి, శ్యామల మల్లేశం, ఉప్పల మెట్టయ్య, గోపాల్రెడ్డి, రహీం, బబ్బూరి రజిత, వరలక్ష్మికనకయ్య, పంబాల అర్చన శివకుమార్, కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ ఆర్కే శ్రీను, నాయకులు అఖిల్, కార్యకర్తలు భారీసంఖ్యలోతదితరులున్నారు. కాగా, శామీర్పేట కట్టమైసమ్మ ఆలయం వద్ద 6వ వార్డు కౌన్సిలర్ బబ్బూరి రజిత, వార్డు అధ్యక్షుడు జోడుప్రకాశ్ తదితరులు సీఎం కేసీఆర్ ఆరోగ్యం త్వరగా బాగుపడాలని పూజలు చేశారు.