అమీన్పూర్ (జిన్నారం), మార్చి 11 : ఫేక్ డాక్యుమెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇందుకోసం ఓ ముఠా ప్రత్యేకంగా పనిచేస్తున్నది. ఫేక్డాక్యుమెంట్లు సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా భూములు విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. పోలీసులకు పిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. ఫేక్ ముఠా గుట్టు రట్టు చేసే లా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని భూముల ధరలు రూ. కోట్లు పలుకుతున్నాయి. అమీన్పూర్ పరిధిలో ఐదు లక్షలకుపైగా జనాభా ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు ఇక్క డ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడి భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ఏకంగా ఫేక్ డాక్యు మెంట్లు సృష్టిస్తున్నారు. ఇందుకోసం కూకట్పల్లికి చెందిన ఓ ముఠా పనిచేస్తున్నట్లు తెలిసింది. తక్కువ ధర చెప్పి ఫేక్ డాక్యుమెంట్లు చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తూ భూములు విక్రయిస్తున్నారు. తీరా నిర్మాణం చేసేందుకు భూమివద్దకు వెళ్లగా ఒరిజినల్ ఓనర్లు వస్తున్నారు. దీంతో తాము మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు. కోర్టులో కేసులు వేస్తున్నారు.
నకిలీ పత్రాల సృష్టి
భూములకు సంబంధించిన ఫేక్ పత్రాలతోపాటు బర్త్, డెత్, ఫ్యామిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నారు. ఒరిజినల్కు దీటుగా ఈ పత్రాలు ఉంటున్నాయి. రెవెన్యూ అధికారుల అండతో ముఠా కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయానికి సంబంధించిన స్టాంపులు, అధికారుల సంతకాలు, ఆన్లైన్లో పేర్లు నమోదు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నా రు. నకిలీ పత్రాలు సృష్టించే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.
తాజాగా వెలుగులోకి..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని బీరంగూడలోని 967 సర్వేనంబర్లో 324, 325 ప్లాంట్నంబర్లలో 800 గజాల స్థలాన్ని శ్రీనివాస్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. తీరా భవనం నిర్మించేందుకు స్థలం వద్దకు వెళ్లగా ఒరిజినల్ ఓనర్లు వచ్చారు. దీంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరిపిన పోలీసులు శ్రీనివాస్ వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఫేక్ అని నిర్ధారించారు. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి విక్రయించిన వ్యక్తులను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోకపోవటం గమనార్హం. తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు
డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా, ఫేక్ డాక్యుమెంట్లు సృస్టిస్తున్నా, ఫేక్ సర్టిఫికెట్లు బయటకు వస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలో ఫేక్ పత్రాలు ఉన్నా అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫేక్ డాక్యుమెంట్లతో నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయి నా ఇలాంటి ముఠాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బర్త్, డెత్, యాజమాన్య ధ్రువపత్రాలు రెవెన్యూ కార్యాలయం నుంచి నకిలీవి బయటకు వస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
రూ.2.09 కోట్లు నష్టపోయా : శ్రీనివాస్, బాధితుడు
ఫేక్ డాక్యుమెంట్లు చూపి 800గజాల స్థలాన్ని విక్రయించారు. సుమా రు రూ.2.09 కోట్లు పెట్టి భూమి కోనుగోలు చేశా. కొంత మంది వ్యక్తులు ఏకమై తనను భూమి కొనిపించేలా ప్రేరేపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశా. ఫేక్ డాక్యుమెంట్లు ఉన్నాయని పోలీసులు నిర్ధారించినా ఇప్పటి వరకు భూమి విక్రయించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారులు, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.