హుస్నాబాద్, అక్టోబర్ 11: హుస్నాబాద్లో ఈనెల 15వ తేదీన జరుగబోయే సీఎం సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో సభాస్థలాన్ని స్థానిక ఏసీపీ వాసాల సతీశ్, ఇతర అధికారులతో కలిసి బుధవారం ఆమె పరిశీలించారు. హెలీప్యాడ్ ఏర్పాట్లు, సభావేదిక, బారికేడ్ల ఏర్పాట్లను పర్యవేక్షించారు. విద్యుత్, ఆర్అండ్బీ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో ఏసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణానికి నాలుగు దిక్కుల నుంచి సభకు జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ముందే గుర్తించి సంబంధిత నాయకులకు తెలియజేయాలన్నారు. సభా స్థలంలో విద్యుత్ వైర్లు ఉన్నందున వెంటనే వాటిని తాత్కాలికంగా తొలిగించాలని సూచించారు. హెలీప్యాడ్ పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సభ అనంతరం సీఎం రోడ్డు మార్గంలో వెళ్లినట్లయితే అందుకు తగిన ఏర్పాట్లు ముందుస్తుగానే చేసుకోవాలన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఏరూట్లో వెళ్తే బాగుంటుందనేది చూసుకోవాలన్నారు.
ఆయా మార్గాల్లో ముందస్తుగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం సభకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ ఎర్రల కిరణ్, ఎస్బీ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు తోట మహేశ్, వివేక్, పోలీసు సిబ్బంది, స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఎడబోయిన తిరుపతిరెడ్డి, గోవిందు రవి, క్రాంతిరెడ్డి, కాస్యాదవ్ పాల్గొన్నారు.