హిందువులు పవిత్రంగా భావించే తిథుల్లో ఏకాదశి ఒకటి. ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రాధాన్యమిస్తారు. దీనితోనే పండుగలు ప్రారంభమవుతాయి. తొలిఏకాదశి సందర్భంగా గురువారం వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మెదక్ రూరల్, జూన్ 28 : తెలుగు వారు పవిత్రంగా భావించే తిథుల్లో ఏకాదశి ఒకటి. ప్రతినెలలో రెండుసార్లు ఏకాదశి తిథులు ఉన్నప్పటికీ, ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి ప్రాధాన్యత ఇస్తారు. లోక రక్షకుడైన శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో అకాల మృత్యుహరణంతో పాటు మోక్షప్రాప్తి కోసం ఈ రోజున కఠిన నియమాలతో ఉపవాస వ్రతాలు ఆచరిస్తుంటారు. సంప్రదాయవాదులు అందరూ ఈ తిథితోనే పండుగల ప్రస్థానం మొదలవుతున్నట్లుగా భావిస్తారు. మోక్ష సాధనకు మనసును మహా విష్ణువుపైన లగ్నం చేసి ఆరాధించడమే ఏకాదశి పండుగ ప్రత్యేకం. ఏకాదశి రోజున ఉపవాస దీక్షలు ఆచరించి తెల్లవారాక అంటే ద్వాదశి రోజున ఎవరికైనా భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమిస్తే లక్ష్యం సిద్ధ్దిస్తుందని నమ్ముతారు. లోకాలన్నింటినీ పరిపాలించే శ్రీమహావిష్ణువు జగద్రక్ష విధుల్లో అలసిపోయాక విశ్రాంతికోసం యోగానిద్రలోకి వెళ్లేరోజు తొలి ఏకాదశి. అందుకే దీనిని శయనైకాదశిగా వ్యవహరిస్తారు. తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలోని ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు మేల్కొంటాడు. దీన్ని ఉత్థాన ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా వ్యవహరిస్తారు. మహావిష్ణువు యోగానిద్రలో ఉన్నంత కాలం ఆయన ప్రసన్నత కోసం నాలుగు నెలల పాటు చాతుర్మాస వ్రతాలు పాటిస్తారు. ఈ కాలంలో వచ్చే వర్షాలతో క్రిమి కీటకాదులు సంచరిస్తాయి. కాబట్టి ఆశ్రమవాసులు అంతా బయటకు రాకుండా నాలుగు నెలల పాటు మహావిష్ణువు నామస్మరణలో గడుపుతారు.
ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించాలి. అందుకే పెద్దలు ఈ కాలంలో వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగా మేలు చేస్తుందన్న మాట. చాతుర్మాస కాలంలో ఆహార నియమాలను పాటిస్తూ విష్ణు నామస్మరణలో కాలం గడిపితే పుణ్యప్రదమే కాకుండా ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని నమ్మి పూర్వీకులు ఈ నియమాన్ని విధించారు. ఏకాదశి రోజు ఉపవాస దీక్ష పాటిస్తే, అశ్వమేధయాగం నిర్వహించిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు. ఏకాదశి రోజున నియమ నిష్టలతో ఉపవాసం, రాత్రంతా జాగరణ చేసి స్వామిని సేవిస్తారు. మరుసటి రోజున ఉదయానే స్నానానంతరం శ్రీహరి పూజచేస్తారు పురోహితులు, పుణ్యమూర్తులను పిలిచి అన్నదానం చేసి తాము భుజించి దీక్ష విరమిస్తారు.
తొలి ఏకాదశి పండుగను హిందువులు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున పిండి వంటలు చేసుకుంటారు. సకినాలు, గారెలు, అరిశెలు, చెగోడీలు వంటి పిండి పదార్థాలు తయారు చేయడంలో మహిళలు తీరిక లేకుండా గడుపుతుంటారు.
ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాల కడలిపై యోగానిద్రలోకి వెళ్లడాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. వానకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే పదకొండు. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు, వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటిన్నింటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవుడికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని నమ్మకం.
-వైద్య శ్రీనివాస్శర్మ, పురోహితులు మెదక్