నర్సాపూర్,జూలై18 : నూతన కోర్టు భవన నిర్మాణానికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిన కోర్టు ప్రదాన గోడను ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కోర్టును పరిశీలించి జడ్జి అనితతో చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ..భారీ వర్షానికి కోర్టు ప్రదాన గోడ కూలిపోవడం దురదృష్టకరమన్నారు. రాత్రి వేళలో కూలడంతోపెను ప్రమాదం తప్పిందని వెల్లడించారు. నూతన కోర్టు నిర్మాణానికి అతి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. దేశంలో జుడిషియల్ కోర్టులకు చాలా ప్రాధాన్యత కలదని వాటిని మనం గౌరవించాలని సూచించారు.
వేరే ఎక్కడ స్థలం కానీ, భవనం కాని లేకపోవడంతో ఐసీడీఎస్ కార్యాలయం లోకి కోర్టును మార్చుతామని, దీనికి అందరు సహకరించాలని ఆయన కోరారు. తాత్కాలిక కోర్టును అన్ని విధాలుగా రూపుదిద్దాలని, అలాగే ఐసీడీఎస్ కార్యాలయాన్ని అన్ని వసతులతో వారికి అప్పగించాలని పంచాయతీరాజ్ డీఈ రాధికాలక్ష్మీని ఆదేశించారు.