దుబ్బాక, ఆగస్టు 6 : పేదల కోసం తుది శ్వాస వరకు పోరాడిన మహనీయుడు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అని టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు రొట్టె రాజమౌళి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యుదయం కోసం జర్నలిస్టు, ఉద్యమకారుడు, ఎమ్మెల్యేగా కృషి చేశారన్నారు. శనివారం సోలిపేట రామలింగారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం చిట్టాపూర్లో విగ్రహానికి కుటుంబీకులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు నివాళులర్పించారు. రామలింగారెడ్డి విగ్రహం వద్ద ఆయన సతీమణి సుజాత కన్నీరు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది.
ఈ సందర్భంగా సోలిపేట ప్రజా పోరాటాలు, సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రధాన భూమిక పోషించారని, ఆయన జీవితం పోరాటాలతోనే కొనసాగిందని గుర్తుచేశారు. సోలిపేట మృతి తెలంగాణకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రామలింగారెడ్డి వర్ధంతిని నిర్వహించారు. దుబ్బాక సర్కా రు దవాఖానలో రామలింగన్న ఆత్మీయబృందం ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామలింగారెడ్డి సతీమణి సుజాత, తనయుడు సతీష్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, రేకులకుంట మల్లికార్జున దేవాలయ చైర్మన్ రొట్టె రమేశ్, కౌన్సిలర్లు దేవుని లలిత, మూర్తి సంధ్యాశ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, ఆస స్వామి, వైస్ ఎం పీపీ అస్క రవి, సర్పంచ్ రాజయ్య, నాయకులు నారాగౌడ్, పర్స కృష్ణ, బానాల శ్రీనివాస్, వంశీ, ఇందిరారాజు, పండు, దుబ్బాక, మిరుదొడ్డి, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల నాయకులు పాల్గొన్నారు.
పోరాటమే సోలిపేట ఊపిరి
-సోలిపేట సుజాత
పేదల కష్టాలను తన కష్టంగా భావించేవారని, కుటుంబం కంటే ప్రజాసేవకే రామలింగారెడ్డి ప్రాధాన్యత ఇచ్చేవారని ఆయన సతీమణి సుజాత అన్నారు. రామలింగారెడ్డి మరణం మాకు తీరని లోటు అంటూ కన్నీరు పెట్టుకున్నారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేకున్నప్పటికీ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. రామలింగారెడ్డి ఆశయ సాధనకు పార్టీ శ్రేణులు, అభిమానులు కృషి చేయాలని కోరారు.