చిలిపిచెడ్, సెప్టెంబర్ 17: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతిబాటలో పయనిస్తున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో మెదక్ జిల్లా అభివృద్ధికి నోచుకోలేదు. నేడు ఊరూరికి వేసిన రహదారుల నిర్మాణాలు అభివృద్ధికి అద్దం పడుతున్నాయి. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం శీలాంపల్లి, అంతారం చౌరస్తా వరకు రోడ్డు వేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి చొరవతో రూ.6.70కోట్లుతో 9కిలో మీటర్ల వరకు వేసిన డబుల్ లేన్ రోడ్డు మండల అభివృద్ధికి ప్రతిబింబంలా కనిపిస్తున్నది.
నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో చిలిపిచెడ్ మండలంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టింది. గతంలో ఇక్కడి తండాలను అప్పటి పాలకులు పట్టించుకోకపోవడంతో రోడ్లు సరిగా లేక ప్రజలు, విద్యార్థులు చాలా అవస్థలు పడ్డారు. నేడు ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో డబుల్ లేన్ రోడ్డు వేయడంతో తండాల ప్రజలు రయ్య్మ్రంటూ దూసుకుపోతున్నారు. చిలిపిచెడ్ మండలంలోని శీలాంపల్లి చౌరస్తా నుంచి అంతారం చౌరస్తా వరకు దాదాపు 9 కి.మీ వరకు సింగల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చారు. శీలాంపల్లి, సోమక్కపేట, రహీంగూడ తండా, సామ్యాతండా, అంతారం, జైరాం తండా, కౌడిపల్లి మండలంలోని కొన్ని గిరిజన తండాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది. గతంలో సింగల్ రోడ్డుతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగివి. ప్రభుత్వం మారుమూల గ్రామాలకు సైతం రోడ్లు వేసి ప్రజల రవాణా కష్టాలను తీర్చింది.
ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో రోడ్డు పనులు చురుగ్గా కొనసాగి పూర్తయ్యాయి. ఈ రోడ్డుకు పంచాయతీ రాజ్ నిధులు రూ.6.70కోట్లుతో మధ్యమధ్యలో చిన్న చిన్న బ్రిడ్జిల నిర్మాణం చేపట్టేలా నివేదిక తయారు చేశారు. ప్రణాళిక ప్రకారం కాంట్రాక్టర్తో పనులు త్వరగా పూర్తయ్యేలా ఎమ్మెల్యే కృషి చేశారు. దీంతో ఇరుకు రోడ్డు బాధలు తీరాయని, డబుల్ రోడ్డుపై సాఫీగా సమయానికి గమ్యస్థానాలకు చేరుకుంటున్నామని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక రాష్ట్రంలోనే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దశాబ్దాల కాలంగా సింగిల్ రోడ్డుతో ప్రజలు నానా అవస్థలు పడ్డాం. ప్రజా సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చారు. దీంతో మా గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడింది.
– కవితాముకుందరెడ్డి, శీలాంపల్లి సర్పంచ్
రోజు ఈ రోడ్డు మీది నుంచే ఆటో నడుపుతా. తెలంగాణ వచ్చనంకనే డబుల్ రోడ్డు అయ్యింది. రోడ్డు మంచిగైంది. సాఫీగా ఉన్న రోడ్డుపై ప్రయాణికులను ఎక్కించుకొని సాఫీగా వెళ్తున్నాం. కౌడిపల్లి, చిలిపిచెడ్, నర్సాపూర్కు వెళ్లే ప్రధాన రహదారి డబుల్ రోడ్డుగా మారడంతో మా ఇబ్బందులు తీరాయి. ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో రోడ్లు మంచిగయినయ్.. ఆటో డ్రైవర్ల తరపున ఎమ్మెల్యే మదన్రెడ్డికి కృతజ్ఞతలు.
– హైమద్, ఆటో డ్రైవర్, సోమక్కపేట
శీలాంపల్లి చౌరస్తా నుంచి అంతారం చౌరస్తా వరకు రూ.6.70కోట్లతో తొమ్మిది కిలో మీటర్లు వరకు చేపట్టిన డబుల్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేశారు. ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక చొరవతో కాంట్రాక్టర్లు నాణ్యతతో పనులు చేపట్టి పూర్తి చేశారు. దీంతో రోడ్డుపై ప్రయాణం సాఫీగా సాగుతున్నది. గతంలో ఈరోడ్డుపై నర్సాపూర్ వెళ్లాలంటే గంట పటేంది. ఇప్పుడు 40 నిమిషాల్లో వెళ్తున్నాం.
– వినోదాదుర్గారెడ్డి, ఎంపీపీ