కంది, ఏప్రిల్ 30: సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ డీఎన్పీల సంయుక్త పరిశోధనలకు వేదికైంది. డై నిప్పోన్ ప్రిటింగ్ కంపెనీ లిమిటెడ్ (డీఎన్పీ) భారతదేశంలోని తొలి పరిశోధన అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని గురువారం ఐఐటీహెచ్లో ప్రారంభించింది. ఐఐటీహెచ్ టెక్నాలజీ రీసెర్చ్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ఎలక్ట్రిక్ మెబిలిటీ, ఆరోగ్య రంగాల్లో పరిశోధనలు ముందుకు తీసుకెళ్లడమే కాకుండా భారత్-జపాన్ ఆవిష్కరణల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నది. ఈ పరిశోధన కేంద్ర ప్రారంభోత్సవంలో జపాన్ కాన్సుల్ జనరల్ మునియో తకాహషి, డీఎన్పీ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఒసాము నకమూరా, ఐఐటీ హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల కోసం వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ సిస్టమ్స్ రూపకల్పనతో పాటు ఆరోగ్య రంగంలో ఏపీఎల్ఎస్ తయారీ ప్రక్రియలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పరిశోధనలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ ఐఐటీహెచ్లో ఈ పరిశోధణ కేంద్రం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
గ్లోబల్ పరిశ్రమ-అకాడమి భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక ముందడుగన్నారు. దేశీయ, గ్లోబల్ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరుగుతాయని తెలిపారు. డీఎన్పీ డైరెక్టర్ నకమూరా మాట్లాడుతూ డీఎన్పీ 150వ వార్షికోత్సవంలో భాగంగా ఐఐటీహెచ్లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. కేంద్ర ఏర్పాటుతో ప్రతిభావృద్ధి, జ్ఞాన మార్పిడి, సంయుక్త ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం అందనుందన్నారు. విద్యార్థులు, పరిశోధకులు గ్లోబల్ స్థాయి సాంకేతికతలపై పని చేసే అవకాశాలు పొందుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు ఐఐటీహెచ్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.