గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడం, మాంసం ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తున్నది. సర్కార్ ఇస్తున్న చేయూతతో వేలాది మందికి ఉపాధి పొందుతుండగా, వలసలకు అడ్డుకట్ట పడుతున్నది. ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేస్తున్నారు. యూనిట్ ధరలో 25శాతం లబ్ధిదారుడు తన వాటాగా చెల్లిస్తుండగా, మిగతా ఖర్చు ప్రభుత్వం భరిస్తున్నది. సంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 19203 మంది లబ్ధిపొందగా, రెండో విడుతలో 10331 యూనిట్లను ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటి వరకు 5131 మంది డీడీల రూపంలో డబ్బులు కట్టడంతో 774 యూనిట్లను పంపిణీ చేశారు. మిగిలిన వారికి ఈ నెలాఖరులోగా అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీలైనంత త్వరగా అర్హులందరూ తమ వాటా చెల్లించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
-సంగారెడ్డి (నమస్తే తెలంగాణ) ఆగస్టు 31
సంగారెడ్డి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో గొర్రెల పంపిణీ వేగంగా సాగుతున్నది. గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ గొర్రెలు అందజేస్తున్నారు. జిల్లాలో మొదటి విడత గొర్రెల పంపిణీ విజయవంతమైంది. మలి విడతలో జిల్లాలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని గొల్లకురుమలకు గొర్రెల యూనిట్లు అందజేస్తున్నారు. ఇటీవల అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ గొర్రెలు పంపిణీ చేశారు. దీంతో జిల్లాలోని గొల్లకురుమలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పశు సంవర్థక శాఖ అధికారులు 774 యూనిట్లు పంపిణీ చేశారు. నెల్లూరు బ్రౌన్ రకం గొర్రెలు సేకరించి అందజేస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వం గొర్రెల పంపిణీకి ప్రాధాన్యం ఇస్తున్నది. మొదటి విడతలో 19,203 మందికి 19,203 యూనిట్లు పంపిణీ చేశారు. ఒక్కో యూనిట్ ధర రూ.1.25 లక్షలు కాగా లబ్ధిదారులు తమవంతు వాటా గా రూ.31,250 చెల్లించారు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందజేశారు. రెండో విడతలో యూనిట్ ధర రూ.1.75 లక్షలకు ప్రభుత్వం పెంచింది. లబ్ధిదారులు తమ వాటాగా రూ.43,750 చెల్లించారు. ఇందులో భాగంగా 10,331 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 5,131 మంది గొర్రెకాపర్లు తమ వంతు వాటా మొత్తం రూ.43,750 డీడీ రూపంలో చెల్లించారు. అందోలు నియోజకవర్గంలో 2027 మంది, నారాయణఖేడ్లో 787, పటాన్చెరులో 518, సంగారెడ్డిలో 749, జహీరాబాద్లో 569 మంది గొల్లకురుమలు తమ వాటా మొత్తం చెల్లించారు. వీరితోపాటు హత్నూర మండలంలోని 481 మంది తమ వాటా డబ్బు చెల్లించారు. మొత్తం 5,131 మంది డబ్బులు చెల్లించడంతో వీరికి యూనిట్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని చంద్రాపూర్, కర్ణాటకలోని బెల్గావ్, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి మేలు జాతి గొర్రెలు సేకరించేందుకు అనుమతిచ్చింది. సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారి, వెటర్నరీ ఆఫీసర్తో కలిపి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. వీరు ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించి మేలు జాతి నెల్లూరు బ్రౌన్ రకం గొర్రెలు కొనుగోలు చేస్తున్నారు. అందోలు నియోజకవర్గంలో 186 యూనిట్లు, నారాయణఖేడ్లో 144, పటాన్చెరులో 132, సంగారెడ్డిలో 156, జహీరాబాద్లో 108, హత్నూర మండలంలో 48 యూనిట్లు పంపిణీ చేశారు. ఈ నెలాఖరు వరకు 5,131 యూనిట్లు పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. మిగితా వారు తమ వాటా డబ్బు చెల్లించిన వెంటనే వారికి యూనిట్లు అందజేస్తామంటున్నారు.
సదాశివపేట, ఆగస్టు 31: గొర్రెల పంపిణీతో గొల్లకురుమల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని బీఆర్ఎస్ నాయకుడు చింతా సాయినాథ్ అన్నారు. గురువారం మండలంలోని సూరారంలో లబ్ధిదారులకు ఆ రు యూనిట్ల గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని, గొల్లకురుమలు ఆర్థికంగా ఎదగాలనేది బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ రత్నాకర్రెడ్డి, సర్పంచ్ రజియాబేగం, ఉప సర్పంచ్ విఠల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, మండల కో ఆప్షన్ మాజీ సభ్యుడు సలావొద్దిన్ పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా అంతటా రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు 774 యూనిట్లు పంపిణీ చేశాం. ప్రభుత్వ నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, గుంటూరు జిల్లాల నుంచి గొర్రెలు కొనుగోలు చేస్తున్నాం. త్వరగా లక్ష్యం మేరకు రెండో విడత గొర్రెల పంపిణీ పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నాం.
– ఎం.వసంతకుమారి, జేడీ పశుంసవర్థశాఖ, సంగారెడ్డి