సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ మున్సిపాలిటీ, మే 23: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. మాతా శిశు మరణాలు అరికట్టడంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గర్భిణుల్లో రక్తహీనతను నివారిస్తూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉండేలా ప్రభుత్వం న్యూట్రీషన్ కిట్లను పంపిణీ చేసేందుకు నిర్ణయించిందన్నారు. దీంతో మంచి ఫలితాలు వస్తాయని మంత్రి ఆకాంక్షించారు. మెదక్ జిల్లాకు 1,338 న్యూట్రిషన్ కిట్లు వచ్చాయని వాటిని 2వ ఏఎన్సీ రిజిస్ట్రేషన్, 3వ ఏఎన్సీ రిజిస్ట్రేషన్ సమయంలో రెండు సార్లు గర్భిణులకు అందించడం ద్వారా ఎనీమియా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
సబ్ సెంటర్ల ప్రగతిపై..
సబ్ సెంటర్ల ప్రగతిపై మంత్రి సమీక్షిస్తూ సబ్ సెంటర్ భవనాల నిర్మాణాల ప్రగతికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సొం త భవనాలు ముంజూరు చేసినందున వాటి నిర్మాణాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించారు. టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా పల్లె దవాఖానలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నూతనంగా మంజూరు చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు, బస్తీ, పల్లె దవాఖానలను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు.
కొనసాగుతున్న కంటి వెలుగు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదని మంత్రి వెల్లడించారు. కంటి వెలుగు ద్వారా 80 పని దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 38 లక్షల 58 వేల మందికి కంటి అద్దాలు అందించామన్నారు. ఏ సమస్యలు లేకుండా పెద్దఎత్తున కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. వైద్యులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు వడ దెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు.
సంగారెడ్డి జిల్లాకు 2,630 న్యూట్రీషన్ కిట్లు
– సంగారెడ్డి కలెక్టర్ శరత్
సంగారెడ్డి జిల్లాకు మొత్తం 2,630 నూట్రీషన్ కిట్లు వచ్చాయని కలెక్టర్ శరత్ మంత్రికి వివరించారు. న్యూట్రీషన్ కిట్లు పంపిణీకి ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాకు 19 బస్తీ దవాఖానలు మంజూరు కాగా, 18 బస్తీ దవాఖానలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఒకటి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని, త్వరలో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 173 పల్లె దవాఖానలున్నాయని, అందులో 136 దవాఖానలలో ఎంఎల్హెచ్పీ (మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్)ల నియామకాలు పూర్తయ్యాయని, 37 పల్లె దవాఖానలకు ఎంఎల్హెచ్పీల నియామకాలు ఒక రోజులో చేపట్టనున్నట్లు చెప్పారు. జిల్లాలో కంటి వెలుగు కింద మే 22 నాటికి 11,27,952 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, 97,407 మందికి రీడింగ్ అద్దాలు, 48,097 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేసినట్లు మంత్రికి తెలిపారు. 547 గ్రామ పంచాయతీలు, 190 వార్డులలో కంటి వెలుగు శిబిరాలు పూర్తయినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. 100 గ్రామ పంచాయతీలు, 9 వార్డుల్లో శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. జూన్ 15లోగా 100 శాతం పూర్తి చేస్తామని చెప్పారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులకు సీపీఆర్పై శిక్షణ అందించామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి, పంచాయతీ రాజ్ ఈఈ జగదీశ్వర్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
గర్భిణులను సమీకరించి పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
– మెదక్ కలెక్టర్ రాజర్షిషా
జిల్లాకు వచ్చిన 1,338 న్యూట్రీషన్ కిట్లను మాతా శిశు సంరక్షణ కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఏరియా దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో గర్భిణులను సమీకరించి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలోని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు చేశారు. జిల్లాలో రాష్ట్ర వైద్యసేవ మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో 34, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 43 ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టగా, ఇంతవరకు 10 కేంద్రాలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. నిర్మాణాలు చివరి దశలో గల వివిధ స్థాయిలలో ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఇంకా ప్రారంభం కాని పనులకు వెంటనే టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించాలని, చేసిన పనులకు ఎంబీ రికార్డు చేసిన వెంటనే డబ్బులు చెల్లింపు జరుగుతాయని కాంట్రాక్టర్లకు తెలుపాలన్నారు. వెల్దుర్తి, రంగంపేట, అల్లాదుర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాలు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు వేగవంతం చేసి వాడుకలో వచ్చేలా చూడాలని ఇంజినీరింగ్ వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలో విజయవంతంగా కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నామని, లక్ష్యాన్ని పూర్తి చేరుకున్న 14 బృందాలను తిరిగి వారి గమ్యస్థానాల్లో విధులు నిర్వహించేలా చూడాలని, మిగిలిన 28 బృందాలను స్ట్రీమ్ లైన్ చేస్తూ శిబిరాలు నిర్వహించాలన్నారు. ఇంకా మిగిలిపోయిన పోలీస్, మున్సిపాలిటీ, వైద్య సిబ్బందికి త్వరలో సీపీఆర్పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఎంహెచ్వో చందునాయక్, డిప్యూటీ డీఎంహెచ్వోలు విజయనిర్మల, అనిల, వైద్యులు శివదాయల్, మాధురి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.