న్యాల్కల్, మార్చి 24: దత్తగిరి మహరాజ్ 45వ వార్షిక అమర తిథిని పురస్కరించుకొని మండలంలోని పలు గ్రామాల మీదుగా వస్తున్న దత్తగిరి మహరాజ్ పాదయాత్ర- పల్లకీ సేవకు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం మండలంలోని మిర్జాపూర్(ఎన్) గ్రామంలోకి చేరుకున్న దత్తగిరి మహరాజ్ పాదయాత్ర-పల్లకీసేవకు భక్తులు భజాభజంత్రీలు, భజన కీర్తనల మధ్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో దత్తగిరి మహరాజ్ విగ్రహానికి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలోని ముంగి చౌరస్తా మీదుగా ముంగి ఆదిలక్ష్మీ ఆశ్రమానికి చేరుకుంది. స్థానిక ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్ ఆధ్వర్యంలో పల్లకీసేవకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం రుక్మాపూర్ మీదుగా మండలంలోని హద్నూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమానికి పాదయాత్ర-పల్లకీ సేవ చేరుకుంది. ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఝరాసంగం మండలంలోని బర్ధీపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతిపతులు అవదూత గిరి మహరాజ్, డాక్టర్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్, న్యామతాబాద్ ఆశ్రమ పీఠాధిపతి విశ్వగిరి మహరాజ్, ముంగి ఆదిలక్ష్మి ఆశ్రమ పీఠాధిపతి దేవగిరి మహరాజ్ భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.