మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ చిన్నశంకరంపేట/ రామాయంపేట/ పాపన్నపేట, సెప్టెంబర్ 28 : జిల్లా కేంద్రం మెదక్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేణుగోపాలస్వామి ఆలయంలో దుర్గామాత మూడో రోజు బుధవారం మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో నిత్యాన్నదానం చేస్తున్నారు.
గాయత్రీ దేవీగా భక్తులకు దర్శనం
మెదక్ మండల పరిధిలోని మాచవరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు గాయత్రీ దేవీగా దర్శనమిచ్చారు. అమ్మవారికి గణపతిపూజ, అఖండదీపారాధన, హోమం ఇతర పూజలు నిర్వహించారు. దుర్గా మాత మాలధారణ వేసిన స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పూజారి మల్లికార్జున, ఆత్మ కమిటీ డైరెక్టర్ బెలం శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
అమ్మవారికి అర్చనలు, ఒడిబియ్యం
చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్తండాలో దుర్గామాత ఆలయంలో గిరిజనులు అమ్మవారికి అర్చనలు, ఒడిబియ్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు.
పాపన్నపేట మండలంలోని కొడుపాకలో దుర్గామాత యువజన సంఘం ఆధ్వర్యంలో దుర్గామాతను ప్రతిష్ఠించా రు. అమ్మవారు గాయత్రీదేవీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గురువారం అమ్మవారు లలితాత్రిపుర సుందరిదేవీ గా దర్శనమిస్తారని ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.
అన్నపూర్ణాదేవిగా మహంకాళి అమ్మవారు
రామాయంపేట పట్టణంలోని దుర్గామాత ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అ మ్మవారు అన్నపూర్ణాదేవీగా దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ పాండురంగాచారి, వరలక్ష్మి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది శ్యాంరాజ్, యాదగిరి, సత్యం, నరేశ్, లక్ష్మి పాల్గొన్నారు.