పాపన్నపేట, ఆగస్టు 13: పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి, దుర్గామాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు బోనాలు సమర్పించారు.
వేద పండితులు శంకర శర్మ, పార్థివశర్మ, మురళీధర్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏడుపాయల చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, ఆలయ ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవివీర్ కుమార్, తోట నరసింహులు, వరుణాచారి, రాజు, శ్రీకాంత్, సంతోష్ తదితరులు ఏర్పాటు చేశాయగా, పాపన్నపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి బందోబస్తు చర్యలు చేపట్టారు.