మెదక్, (నమస్తే తెలంగాణ)/ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 4: రైతన్నకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేసిందని, ఇది వర్తింపజేసి, రైతులకు కొత్తగా రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రుణ మాఫీ చేసిన రైతులందరికీ కొత్తగా పంట రుణాలు మంజూరు చేసేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేస్తూ లబ్ధి చేకూరుస్తున్నదన్నారు. ఇందు లో భాగంగా ఇప్పటికే 18.79 లక్షల మంది రైతులకు రుణమాఫీ కింద రూ.9654 కోట్ల నిధులు విడుదల చేసినట్లు వివరించారు. బ్యాంకు అకౌంట్లు రద్దు చేసుకోవడం, వినియోగంలో లేకపోవడం వంటి కారణాల వల్ల లక్షా 60 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బు జమ కాలేదన్నారు.
అయినప్పటికీ సదరు రైతుల ఆధార్ నెంబర్ను అనుసంధానం చేసుకుని పరిశీలించి, 95,845 మందికి రైతుబంధు ఖాతాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వారికి రుణమాఫీ డబ్బులు త్వరలోనే ఖాతాల్లో జమ చేయిస్తామన్నారు. మిగతా 48 వేల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్లకు సూచించారు. రుణమాఫీ జరిగిన రైతులకు కొత్తగా పంట రుణాలు మంజూరు చేసేలా ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆసరా పెన్షన్లు, కారుణ్య నియామకాలు తదితర కార్యక్రమాల ప్రగతిని జిల్లాల వారీగా సమీక్షించారు. ఆసరా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మృతి చెందితే, వారి జీవిత భాగస్వామికి పెన్షన్ బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జీవిత భాగస్వామికి కొత్తగా మంజూరు చేసే ప్రొసీడింగ్ పత్రాలు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో ఇప్పించేందుకు కృషి చేయాలన్నారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేగవంతంగా నియామకాల ప్రక్రియను పూర్తి చేయడంపై కలెక్టర్లను అభినందించారు. మెదక్ జిల్లా వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీవో శ్రీనివాస్, సీపీవో కృష్ణయ్య, డీఏవో గోవింద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో 1881 ఆసరా స్పౌజ్ పెన్షన్లు
సంగారెడ్డి కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఆసరా స్పౌజ్ పెన్షన్లు 1881 మంజూరయ్యాయని, ఇప్పటికే 1270 మందికి విడుదల చేశామన్నారు. మిగతా 611 మంది కి ప్రొసీడింగ్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. మరో 75 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉన్నదన్నారు. జిల్లాలో రుణ మాఫీ కింద 72,792 మంది రైతులకు రూ.428.52 కోట్ల మాఫీ జరిగిందన్నారు. సోషల్ వెల్ఫేర్ హౌస్ సైట్స్ పంపిణీ కింద ఇప్పటివరకు 1999 నిరుపేదలకు పట్టాలు ఇచ్చామని వివరించారు. కారు ణ్య నియామకాలకు సంబంధించి 29 మందిలో 23 మందికి పూర్తయ్యాయని, వివిధ కారణాలతో ఆరు పెండింగ్లో ఉన్నాయన్నారు. సంగారెడ్డిలో డీఆర్వో నగేశ్, డీఆర్డీవో శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.