రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై పోరు చేస్తున్నది. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నది. పాజిటివ్ వచ్చిన వారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు పీహెచ్సీలతో పాటు కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, జిల్లా కేంద్ర దవాఖానల్లో అవసరమైన బెడ్స్ అందుబాటులో ఉంచింది. మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో 140 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో వ్యాక్సినేషన్కు ప్రజలు బారులు తీరుతున్నారు. శనివారం 24 కేంద్రాల్లో 3,899 మందికి వ్యాక్సిన్ వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు జిల్లాలో 82,000 మందికి టీకా వేయడం పూర్తయ్యింది.
కరోనా కలింగ మడుగులను తలపిస్తున్నది… అలాంటి మృత్యుకూపానికి ప్రజలను దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య సిబ్బంది ఎంతో శ్రమిస్తూ కలియుగ దైవాలుగా నిలుస్తున్నారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా కొవిడ్-19 బాధితులను కాపాడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన ప్రాథమిక వైద్య కేంద్రాలు, సీహెచ్సీలు, పీహెచ్సీలు, కొవిడ్వార్డుల్లో వైద్యులు, సిబ్బంది పీపీఈ కిట్లు వేసుకుని నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తూ పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తులకు వెంటనే హోం ఐసొలేషన్ కిట్లు, మందులు అందిస్తూ సలహాలు ఇస్తున్నారు. మరోవైపు టీకాలు వేస్తూ, పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తున్నారు.