దుబ్బాక, జూన్ 27 : పుష్కర కాలం తర్వాత చేనేత సహకార ఎన్నికలు జరుగుతున్నాయి. నెల రోజుల కిందటే సహకార సంఘాల ఓటరు జాబితాలు సిద్ధం చేశారు. సొసైటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పోటీకి ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 17 సొసైటీలు ఉన్నాయి. ఇందులో చేనేత సహకార సంఘాలతో పాటు ఉన్ని సహకార సంఘాలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని 17 చేనేత సొసైటీల్లో 5652 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. ఇందులో మృతుల ఓటర్లను తొలిగించడంతో 3056 మంది సభ్యులతో తుది ఓటరు జాబితాను ఇటీవల విడుదల చేశారు.
ప్రస్తుతం 13 సొసైటీలకు మాత్రమే ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో సిద్దిపేట చేనేత సహకార సంఘం, సిద్దిపేట ఆదర్శ సొసైటీ, సిద్దిపేట ప్రాజెక్ట్ సొసైటీ, ఇరుకోడు , గజ్వేల్, పోట్లపల్లి, చెర్లతోటపల్లి, శ్రీరాములపల్లి, దుబ్బాక, దుద్దెడ చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. లింగారెడ్డిపల్లి, ధర్మారం, గజ్వేల్ ఉన్ని సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 4 సొసైటీలకు ఎన్నికలు జరగడం లేదు. ఇందులో 2 (వీరారెడ్డిపల్లి, చేర్యాల) చేనేత సొసైటీలు, 2 (లింగారెడ్డిపల్లి, చేర్యాల) ఉన్ని సంఘాలు ప్రస్తుత ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. సొసైటీ ఎన్నికలకు ఈనెల 22న రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 29న సహకార సంఘాల్లో ఎన్నికల ప్రక్రియ నోటీసును సొసైటీ ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. జూలై 2 నుంచి 4 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
జూలై 5న నామినేషన్ల పరిశీలన, జూలై 6న నామినేషన్ల విత్ డ్రా, పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు చేపడతారు. జూలై 10 పోలింగ్, ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో పాలకవర్గం ఏర్పాటు, ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో 4 సొసైటీల్లో చేతులెత్తే విధానంతో ఎన్నికలు జరుగుతాయి. 50 మంది సభ్యుల లోపున్న సొసైటీల్లో సభ్యులు చేతులెత్తే విధానంతో చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇందులో సిద్దిపేట ఆదర్శ, పొట్లపల్లి, చెర్ల తోటపల్లి చేనేత సహకార సంఘాలతో పాటు గజ్వేల్ ఉన్ని సొసైటీ ఎన్నిక చేతులెత్తే విధానంతో జరుగుతుంది. జూలై 3న ఈ సొసైటీల్లో ఒకే రోజున పాలక వర్గం ఎన్నిక జరుగనున్నది.