మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 16: కాంగ్రెస్ పార్టీ కుట్రదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, పెత్తందారి పోకడలకు అలవాటుపడ్డ ఆ పార్టీ అధినాయకత్వం ఉదయ్పూర్ డిక్లరేషన్ను తుంగలో తొక్కిందని పీసీసీ ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం మెదక్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఒక కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇవ్వబోమని, ఐదేండ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వారికే టికెట్ కేటాయింపు ఉంటుందని ప్రకటించి, నిబంధనలను ఉల్లఘించిందన్నారు. కొత్తగా పార్టీలో చేరిన పిల్లవాడికి మెదక్ టికెట్ ఎలా కేటాయిస్తారని, ఆ పిల్లవాడికి ఉన్న అర్హత ఏమిటీ, మెదక్ నాయకులకు లేనిదేమిటని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. మూడు పర్యాయాలుగా పార్టీకి సేవలందిస్తున్న వారిని కాదని కొత్త వారికి టికెట్లు ఎలా ఇస్తారన్నారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆర్యవైశ్యులకు సైతం ఒక్క టికెట్ కేటాయించలేదన్నారు. మెదక్ టికెట్ పార్టీ నాయకులకు కాకుండా అప్పుడే వచ్చిన వారికి టికెట్ కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. డబ్బు సంచులకు అలవాటు పడ్డ పీసీసీ పెద్ద మెదక్ టికెట్ను తాడు బొంగరం తెలియని వ్యక్తికి ఇచ్చి కాంగ్రెస్ నాయకుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. స్థానిక నాయకులను ఎవరిని సంప్రదించకుండా మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించడం ఏమిటని పీసీసీ ఆధ్యక్షుడు రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీ ఆమోదించిన ఉదయ్పూర్ డిక్లరేషన్కే దిక్కులేదని, పార్టీ మ్యానిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బాలకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందన్నారు. మాటలకు కట్టుబడి లేని పార్టీలో ఉండటం కంటే పార్టీని విడవడమే మంచిదని నిర్ణయుంచుకుని తన అనుచరులతో కలిసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పీసీసీ ప్రతినిధికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటింటారు. రాజీనామా పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడికి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.