సంగారెడ్డి కలెక్టరేట్, మే 11: సీఎం కప్ క్రీడా పోటీలకు జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ‘చీఫ్ మినిష్టర్స్ కప్-2023’ పోటీల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 17 వరకు మండలస్థాయిలో అథ్లెటిక్స్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంశాల్లో పురుషులు, మహిళలకు వేర్వేరుగా పోటీలను నిర్వహించనున్నట్లు వివరించారు. రెజ్లింగ్, బాక్సింగ్ పోటీలకు కేవలం పురుషులను మాత్రమే జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక చేయాలన్నారు.
గెలుపొందిన విజేతలను జిల్లాస్థాయికి పంపించాలన్నారు. 15 నుంచి 36 సంవత్సరాల్లోపు వయస్సు కలిగిన వారందరూ ఈ పోటీలకు అర్హులని కలెక్టర్ స్పష్టం చేశారు. క్రీడల నిర్వహణకు మండలస్థాయిలో ఎంపీపీ, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఈవో, గెజిటెడ్ హెచ్ఎం, జడ్పీటీసీ, పోలీసుశాఖ, ఎస్సై, పీడీ, పీఈటీ, మున్సిపల్ కమిషనర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలతో పాటు సర్పంచ్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేసి పోటీలను విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాస్థాయిలో 11 రకాల క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
22 నుంచి 24 వరకు జిల్లాస్థాయి పోటీలు
ఈ నెల 22 నుంచి 24 వరకు జిల్లాస్థాయి పోటీలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ శరత్ అన్నారు. మండలస్థాయి క్రీడలు పూర్తికాగానే విజేతల జాబితాను జిల్లాస్థాయికి పంపించాలన్నారు. పీడీలు, పీఈటీల సహకారంతో అన్ని నియమనిబంధనలతో పోటీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అయితే మండలస్థాయి క్రీడలను మండల కేంద్రంలో, తెలంగాణ క్రీడా ప్రాంగణం, హైస్కూల్స్, రెసిడెన్షియల్స్లలో నిర్వహించేలా చూడాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పోటీలను నిర్వహించాలన్నారు. మండలస్థాయి విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లతో పాటు, పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లను అందించనున్నట్లు తెలిపారు. క్రీడల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 వేల చొప్పున నిధులు కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, మండల నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.