సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 31: కంటి వెలుగు శిబిరాలు ఉదయం 9గంటల కల్లా ప్రారంభించాలని కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ శాఖలతో కంటి వెలుగు కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కంటి సమస్యలున్న ప్రతిఒక్కరికీ 100 శాతం వైద్య సేవలు అందేలా షెడ్యూలు చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఐసీడీఎస్ అంగన్వాడీలు, పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశలు, పబ్లిక్ మొబిలైజేషన్ సరిగ్గా ప్రణాళిక చేసుకోవాలన్నారు. రోజూ కనీసం 200 మందిని స్క్రీనింగ్ చేయాలన్నారు. కంటి వెలుగు బృందాలకు నాణ్యమైన భోజనం అందించాలని, సమయానికి రావాలని కలెక్టర్ సూచించారు. టాబ్ ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లు జరిగినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రీడింగ్ అద్దాలు ఇచ్చిన వారందరి ఫొటో తీసుకుని అప్లోడ్ చేయాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్కు సంబంధిత యాప్లో ఏవిధంగా ఎలా అప్లోడ్ చేయాలనే విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. కోర్టు, జైలు, చక్కెర కర్మాగారాలు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
రేషన్ బియ్యం సరఫరా చేయాలి
రేషన్ బియ్యాన్ని నిర్ణీత సమయంలోగా స్టేజ్ -1, స్టేజ్ -2 కాంట్రాక్టర్లు సరఫరా చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఎప్పటికప్పుడు రేషన్ బియ్యంపై పర్యవేక్షణ చేయాలన్నారు. హాస్టళ్లు, చౌకధరల దుకాణాలు, ఎంఎల్ఎస్ పాయింట్స్, అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సరఫరా చేస్తున్న బియ్యానికి సంబంధించి తనిఖీలు నిర్వహించి, నివేదికలు అందజేయాలని ఆదేశించారు. అన్ని చౌక ధర దుకాణాల వద్ద సూచిక స్టాక్ వివరాలు, నేమ్ బోర్డ్ ప్రదర్శించాలన్నారు. ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జిలకు సూచించారు. త్వరలో అన్ని చౌకధర దుకాణాలను తనిఖీ చేస్తామని, ప్రభుత్వ నిబంధనల మేరకు నడుచుకోవాలని డీలర్లకు సూచించారు. ప్రతి 3 మాసాలకు ఒకసారి జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఫోర్టిఫైడ్ బియ్యం గురించి క్లుప్తంగా వివరించారు.
మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు ప్రత్యేక డ్రైవ్
మత్స్య సహకార సంఘాల్లో కొత్తగా సభ్యత్వంతో పాటు నూతన మత్స్య పరిశ్రమ సహకార సంఘాల ఏర్పాటుకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశాల మేరకు, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ భూక్య ఆధ్వర్యంలో కలెక్టర్ చాంబర్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 206 మత్స్య సహకార సంఘాలు, అందులో 10,485 మంది సభ్యులు ఉన్నారన్నారు. జిల్లాలో ఈనెల ప్రత్యేక డ్రైవ్ చేపట్టి అర్హులను గుర్తించి నూతన సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నీటి వనరులు, విస్తీర్ణాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న 152 సొసైటీల్లో 4,937 మంది కొత్త సభ్యులను చేర్చుకోనున్నట్లు తెలిపారు. 321 మంది కొత్త సభ్యులతో 14 సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీడీ పద్మావతి, జిల్లా మత్స్య శాఖ ఏడీ సతీశ్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఫీల్డ్ ఆఫీసర్లు ఆయా సంక్షేమ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు, డీలర్లు పాల్గొన్నారు.