దుబ్బాక, జూలై 20: ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. శానిటైజేషన్ డ్రైవ్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓపీ ఎంత, అందరూ సమయ వేళలు పాటిస్తున్నారా అని మెడికల్ ఆఫీసర్ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించేలా పనిచేయాలని మెడికల్ ఆఫీసర్, సిబ్బందిని ఆదేశించారు. దవాఖానకు వచ్చిన బాలికతో మాట్లాడారు. డాక్టర్లు సూచించిన మెడిసిన్ క్రమం తప్పకుండా వాడుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. చింతమడక మహత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో బాలికలకు ఐడు రోజులుగా జ్వరం వస్తుందని, గురుకులంలో ఫీవర్ సర్వే జరిపించాలని డీఎంహెచ్వోను ఈ సందర్భంగా కలెక్టర్ ఫోన్ ద్వారా ఆదేశించారు.