అభివృద్ధి చంద్రుడు వస్తున్నాడు.., నేడు సంగారెడ్డి జిల్లాలోని మినీ ఇండియాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. పలు ప్రగతి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేయనున్నారు. దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్న కొల్లూరు టౌన్షిప్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని ముందుగా ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయిస్తారు. స్థానికులు, పారిశ్రామిక వాడల్లోని కార్మికుల ఆరోగ్యం కోసం పటాన్చెరులో నిర్మించనున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రగతి ప్రదాత ఆగమనంతో స్వాగతం పలికేందుకు పటాన్చెరు పట్టణం సిద్ధమయ్యింది. ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీ మయమైంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
– పటాన్చెరు/ రామచంద్రాపురం, జూన్ 21
రామచంద్రాపురం, జూన్ 21: కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి బల్దియా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్లూర్ డబుల్ ఇండ్లను ప్రారంభించనున్నారు. కొల్లూర్ డబుల్ ఇండ్ల ప్రాజెక్ట్కు అధికారులు ‘కేసీఆర్నగర్గా నామకరణం చేశారు. ముఖద్వారం గేట్కు, వాటర్ ట్యాంక్పైన కూడా వాల్ పెయింటింగ్తో కేసీఆర్నగర్ అని రాయించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రధాన గేటు నుంచి కొల్లూర్ ఓఆర్ఆర్ వరకు రోడ్డుకు మరమ్మతులు చేసి తార్ వేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయంలోని రోడ్లు, ఖాళీ స్థలాలను బల్దియా సిబ్బంది శుభ్రం చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని పువ్వులతో అలంకరించారు. బల్దియా, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు ఏర్పాట్లను ప్రతినిత్యం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర మీడియా ప్రతినిధులకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన వీడియోను ప్రొజెక్టర్ ద్వారా చూపించారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో పోలీస్ బందోబస్తుపై సమీక్షించారు. సీఎం కేసీఆర్ వచ్చే రూట్ మ్యాప్ని ఆమె పరిశీలించారు. మినీ వ్యాన్లో ఆమె తిరిగి పరిసరాలను పరిశీలించి ఏసీపీ, ఇన్స్పెక్టర్లకు పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవానికి వచ్చే వాహనాల పార్కింగ్, సీఎం కేసీఆర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన తర్వాత బ్లాక్ని ప్రారంభించేందుకు వెళ్లే మార్గంలో పోలీస్ బందోబస్తుకు సంబంధించి సిబ్బందికి సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ కొల్లూర్కి చేరుకోగానే ముఖద్వారంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి 93వ బ్లాక్ వద్దకు చేరుకుంటారు. అక్కడ 93వ బ్లాక్ని ప్రారంభించి రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు లబ్ధిదారులు, పటాన్చెరుకు చెందిన ఇద్దరు లబ్ధిదారులు మొత్తం ఆరుగురికి సీఎం కేసీఆర్ ఇండ్ల పట్టాలు అందజేసిన అనంతరం ఫ్లాట్ నంబర్లు 106 నుంచి 111 వరకు ఏదో ఒక ఇంటి లోపలికి వెళ్లి పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి పటాన్చెరులో సూపర్స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్తారు.
పటాన్చెరు, జూన్ 21: పటాన్చెరులో సీఎం కేసీఆర్ పర్యటించి 200 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానకు శంకుస్థాపన చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ పటాన్చెరు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే సందర్భంలో పటాన్చెరు పట్టణానికి వచ్చే వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు, సభా నిర్వాహకులు పలు చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.