టీఆర్ఎస్ పార్టీ.. ఏ వ్యక్తిదో..శక్తిదో కాదు.. ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ప్రజల అభ్యున్నతికి పరితపించే పార్టీ… ఒక్కమాటలో చెప్పాలంటే తెలంగాణకు కాపలాదారు… అని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ 21 ఏండ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం హైటెక్స్ వేదికగా ప్లీనరీ సమావేశం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది. తెలంగాణను పాలనలో మోడల్గా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అభివృద్ధి, సంక్షేమంలో 21వ శతాబ్దానికి దిక్సూచిగా మార్చారు. పార్టీ ప్లీనరీ సమావేశాన్ని కూడా అదే స్థాయిలో నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక బార్కోడ్లు కేటాయించి, పార్కింగ్ నుంచి సీట్ల కేటాయింపు వరకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. భగ భగ మండుతున్న ఎండలోనూ చల్లని వాతావరణాన్ని కల్పించి చక్కటి అనుభూతిని మిగిల్చారు. సువిశాలమైన వేదికతోపాటు, విభిన్న రకాల నోరూరించే రుచులతో కార్యకర్తలకు కడుపునిండా కమ్మటి భోజనాన్ని వడ్డించారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ 21 ఏండ్ల జైత్రయాత్రను తెలియజేస్తూనే దేశ భవిష్యత్ను మార్చటంలో పోషించాల్సిన పాత్రపై పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ప్రగతిలో దేశవ్యాప్తంగా పది గ్రామాలకు అవార్డులిస్తే…ఇందులో ఒకటి నుంచి పది తెలంగాణలోనే ఉన్నయి. ఒట్టిగనే వచ్చినయా? ఎంతో ముందుచూపుతో పనిచేస్తేనే కదా.. సాధ్యమైంది. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు గెలిచినం. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో పల్లె,పట్టణ ప్రగతి చేపట్టినం. మొక్కలు పెంచకపోతే టీఆర్ఎస్ సర్పంచైనా తీసేస్తామని చెప్పినం. నూతన పంచాయతీరాజ్ చట్టం అమలుతో చాలా అద్భుతాలు సాధించినం.
తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం పుట్టిందే టీఆర్ఎస్. ఇక్కడివారి ఉనికి, హక్కుల కోసం బరితెగించి పోరాడుతాం. వెయ్యికోట్ల ఆస్తి ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల సొంతం. రాజధాని, జిల్లా కార్యాలయాల్లో అద్భుతమైన కార్యాలయాలు కలిగివున్న పార్టీ. ఇవన్నీ తెలంగాణ ప్రజల ఆస్తిపాస్తులు. తెలంగాణవాసులకు అనుక్షణం కాపలాదారుగా ఉంటాం. వెన్నంటి కాపాడుకుంటాం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి గుజరాత్ గోల్మాల్ మోడల్, బుల్డోజర్, డబుల్ ఇంజిన్లు వద్దు… బంగారు తెలంగాణ మోడల్ కావాలి. ఏడున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ విజయాలు సాధిస్తే, ప్రధానిగా మోదీ వైఫల్యాలు మూటగట్టుకున్నారు.‘మేరా భారత్ మహాన్’ను నిజం చేయగలిగేది సీఎం కేసీఆరే.
జాతీయ వాదం అంటూ జాతి సంపద అయిన హెచ్పీసీఎల్, బీపీసీఎల్, కోల్ ఇండియా, ఎల్ఐసీని మోదీ అమ్ముతున్నాడు. నవరత్నాలను తనకు ఇష్టమైన ఇద్దరు రత్నాలకు ఇచ్చేందుకు తహతహలాడుతున్నాడు. అందుకే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. డిజిటల్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఫిట్ ఇండియా వంటి నినాదాలు ఇచ్చిన మోదీ.. ఇప్పడు బేచో ఇండియా అంటున్నాడు. కాబట్టి సోచోఇండియా అని నేను పిలుపునిస్తున్నాను.