పెద్దశంకరంపేట, మార్చి 23 : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో వందకు పైగా ఎమ్మెల్యే సీట్లు గెలిచి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. గురువారం పెద్దశంకరంపేటలోని బాయికాడి పద్మయ్య ఫంక్షన్హాల్లో 13 గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితితోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేండ్లుగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు, వచ్చిన తర్వాత మార్పుని, జరిగిన అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలన్నారు. పక్క రాష్ర్టాలతో తెలంగాణను పోల్చి చూస్తే ప్రతిపక్షాలకు అభివృద్ధి అంటే ఏమి టో తెలుస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చేస్తున్నదని దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు మంజూరు చేసినప్పటికీ తెలంగాణకు మాత్రం ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులపై ఈడీ, ఇన్కంట్యాక్స్, సీబీఐ లాంటి సంస్థలతో దాడులు చేపిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడ కూడా రూ. 600కు మించి పింఛన్లు ఇవ్వడం లేదని తెలంగాణలో సీఎం కేసీఆర్ వృద్ధులు, ఒంటరి మహిళలకు 2,016, దవ్యాంగులకు రూ.3,016 పింఛన్ ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ఏమీ చేయలేదని, వారి కల్లబొల్లి మాటలు నమ్మొద్దన్నారు. స్వరాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగిందని, దేశానికే ధాన్యాన్ని అందించే స్థితికి ఎదిగామన్నారు. మనపక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల రైతులు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లో సైతం రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు లేవన్నారు. తెలంగాణ కేంద్రానికి రూ.100 చెల్లిస్తే తిరిగి ఇచ్చేది మాత్రం రూ.40 మాత్రమే, మనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇతర రాష్ర్టాలకు ఖర్చుచేస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొందరు వస్తున్నారని, వారికి బుద్ధిచెప్పాలని అన్నారు. గతంలో తాగునీటి కోసం నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు బారులు తీరేవారని, ప్రస్తుతం మిషన్భగీరథతో సీఎం కేసీఆర్ ఇంటింటికీ తాగునీరు అందిస్తూ మహిళల కష్టాలు తీర్చారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకున్న శక్తిసామర్థ్యాలు ప్రత్యర్థులకు లేవని, కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు.జాతరలను మరిపించేలా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపి మరింత చైతన్యవంతం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వెనుబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డిలు నిరంతరం కృషి చేస్తున్నారని, మరోసారి భారీ మెజార్టీతో ఖేడ్ ఎమ్మెల్యేగా భూపాల్రెడ్డిని గెలిపించాలని పిలుపు నిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మొద్దు
ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజెపీ నాయకులు గ్రామాల్లో తిరుగుతూ అబద్ధాలు చెబుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు కరెంట్, నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో చెరువులు, కుంటలకు మరమ్మతుల పేరుతో రూ.12 కోట్లు మంజూరు చేయించుకుని పనులు చేయకుండా జేబులు నింపుకున్నారని ఆరోపించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు తగిన ధర కల్పించకుండా రైతులను ఇబ్బందుల పాలు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. ఇందిరమ్మ గృహాలు, మరుగుదొడ్లు, ఉపాధిహామీ, రుణాల పేరుతో ప్రజల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేసి దోచుకుతిన్న ఘనత వారిదన్నారు.
ఒకప్పుడు సోనియాగాంధీని విమర్శించిన నాయకుడు ఓటుకు నోటు కేసులో అరస్టై ప్రస్తుతం ఇష్టారీతిగా బీఆర్ఎస్ను విమర్శిస్తూ సోనియాను పొగుడుతున్నాడన్నారు. అలాంటి నాయకులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తామే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మాయమాటలు చెబుతూ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నదన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థల పేరుతో బీఆర్ఎస్ నాయకులను దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు అభివృద్ధిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారికి దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించి, ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
అనంతరం 10 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కళాకారుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ భూత్కూరి విజయరామరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కుంట్ల రాములు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బోండ్ల దత్తు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, సీనియర్ నాయకులు వేణుగోపాల్గౌడ్, సుభాశ్గౌడ్, సంతోశ్కుమార్, సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.