జహీరాబాద్, మే 23: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బల్దియాలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక మళ్లీ వాయిదా పడింది. నాలుగు కోఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీలో 37 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 15 మంది బీఆర్ఎస్, 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. బీజేపీకి చెందిన 3, మజ్లిస్ పార్టీ, స్వతంత్రులు ఇద్దరు చొప్పున కౌన్సిలర్లు ఉన్నారు.
బీఆర్ఎస్, బీజేపీకి చెం దిన కౌన్సిలర్లు, ఒక ఎక్స్అఫీషియో(ఎమ్మెల్యే) కలిపి 19 మంది ఉన్నారు. కాంగ్రెస్, మజ్లిస్, స్వతంత్ర కౌన్సిలర్లు, ఒక ఎక్స్అఫీషియో (ఎంపీ) కలిపి 20 మంది ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు అవకాశం దక్కనివారు, రిజర్వేషన్లు కలిసి రాక అవకాశంరాని నాయకులు ప్రస్తుతం కోఆప్షన్ సభ్యుల పదవులకు పోటీపడుతున్నారు. ఆయా పార్టీలకు చెందిన 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 24న కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కోరం లేని కారణంగా వాయిదా వేశారు.
కోఆప్షన్ పదవుల కోసం కాంగ్రెస్లో తీవ్రమైన పోటీ ఉండడంతోనే జ్యాపం జరుగుతున్నది. పదవులు కట్టబెట్టడం కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారింది. కౌన్సిలర్లతో సమానంగా కోఆప్షన్ సభ్యులకు అధికారాలు ఉండడంతో అధికార పార్టీలో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఈనెల 21న హైదరాబాద్లో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సమక్షంలో జహీరాబాద్ పట్టణ కాంగ్రెస్ నేతలు సమావేశమై కోఆప్షన్ సభ్యుల ఎంపికపై పార్టీ నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో శుక్రవారం జరగాల్సిన కోఆప్షన్ సభ్యుల ఎంపిక శనివారానికి వాయిదా వేశారు.
నిబంధనల ప్రకారం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించడానికి, తప్పనిసరిగా మూడు రోజుల ముందు నోటిఫికేషన్ అందించడం సాధ్యపడలేని కారణంగా వాయి దా వేస్తున్నట్టు మున్సిపల్ అధికారులు తెలిపా రు. త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య ధోరణిపై బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాటిమాటికి వాయిదా వేయడం సరికాదని ఆ పార్టీల నేతలు పేర్కొంటున్నారు.