బొల్లారం, జనవరి 18: అభం శుభం ఎరుగని ఓ చిన్నారి ప్రాణాలను గాలిపటం బలితీసుకుంది. సరదాగా ఎగరేస్తున్న గాలిపటం దారం కాస్త కరెంటు తీగలకు చిక్కుకోవడంతో ఆ దారాన్ని తీయబోయి 12ఏండ్ల బాలుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక సంఘటన ఐడీఏ బొల్లారం పోలీస్స్టేషన్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికు లు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా నందిగామ మండలం పాత బెల్లంకొండవారి పాలెం గ్రామానికి చెందిన సవలం వీరబాబు, మంచాలి దంపతులు బొల్లారం పారిశ్రామికవాడలోని మల్లన్న బస్తీలో నివాసం ఉంటున్నారు. మంగళవారం వీరి కుమారుడు రిషి(12) రెండో అంతస్తు పై గాలిపటం ఎగురవేయగా గాలిపటం దారం సమీపంలోని విద్యుత్ వైర్లకు చిక్కుకుపోయింది.
గాలిపటాన్ని తీసే ప్రయత్నంలో విద్యుత్ తీగ లు తగిలి తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత బాలుడి కుటుంబానికి స్థానిక కేజేఆర్ ఫౌండేషన్ సంఘ సేవకులు ఆనంద్ కృష్ణారెడ్డి సొంతూరికి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అం బులెన్స్ ఏర్పాటు చేసి ఖర్చులకు రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.