జిల్లాలో కొనసాగిన నిరసనలు
కేంద్ర వైఖరిపై మండిపాటు
దిష్టిబొమ్మల దహనాలు
చేర్యాల, జూన్ 17 : కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నియామకాల్లో చేపట్టిన అగ్నిపథ్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు దాసరి కళావతి డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలో పాత బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అత్యంత కీలకమైన ఆర్మీ రంగంలో అగ్నిపథ్ పేరుతో యువతకు ఉపాధి వ్యతిరేక విధానాన్ని తీసుకొచ్చి కేవలం నాలుగు సంవత్సరాల వరకే ఉద్యోగంలో ఉండి ఆ తర్వాత ఇంటికి పంపే పద్ధతిని తీసుకురావడం ఏమిటన్నారు. ఉద్యోగ భద్రత,పెన్షన్ సౌకర్యం లేని ఈ విధానం వెంటనే రద్దు చేయాలని, ఇప్పటికే దేశంలోని అనేక రాష్ర్టాల్లో యువత నిరసనలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఆందోళనలో మండల కార్యదర్శి కొంగరి వెంకట్మావో, రేపాకకుమార్, ముస్త్యాల ప్రభాకర్, ఎర్రబోసు అశోక్, ఎండీ.హజ్గర, ఆముదాల రంజిత్, బ్రహ్మయ్య, నాగభూషణం, విష్ణు పాల్గొన్నారు.
‘అగ్నిపథ్’ ను వెంటనే రద్దు చేయాలి
దుబ్బాక టౌన్, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన కాల్పులను వ్యతిరేకిస్తూ దుబ్బాకలో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి. భాస్కర్ మాట్లాడుతూ… సాయుధ దళాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పోస్టుల భర్తీ కోసం మోదీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం కాల్పులు చేయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 42 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయన్నారు. రెండేండ్లుగా సైనిక నియామకాలు జరుగలేదని, ఆరు నెలల శిక్షణా కాలంతో 4 సంవత్సరాల స్వల్పకాలిక ఉద్యోగ కల్పనకు నిర్ణయించడం అవివేకమైన చర్య అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ చివరకు దేశ రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయాలనే కుట్రలో భాగంగానే ఈ అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొంపెల్లి భాస్కర్, రాజు, శ్రీనివాస్, మల్లేశం, యాదగిరి, రమేశ్ పాల్గొన్నారు.
చెట్లకు నిప్పుపెట్టిన వ్యక్తికి జరిమానా
మద్దూరు(ధూళిమిట్ట), జూన్17: మద్దూరు మండలం సలాఖపూర్లో హరితహారం చెట్లకు నిప్పు పెట్టిన గ్రామానికి చెందిన తరిగొప్పుల వెంకటయ్య అనే వ్యక్తికి గ్రామ పంచాయతీ రూ. 2వేల జరిమానా విధించింది. ఈ సందర్భంగా సర్పంచ్ భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఓ యజ్ఞంలా మొక్కలు నాటుతుందన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నారు. మొక్కల సంరక్షణకు గ్రామ పంచాయతీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.