తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ ఉత్సవాలు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. బుధవారం నాలుగోరోజూ నానబియ్యం బతుకమ్మ వేడుకను మురిపెంగా నిర్వహించారు. మెదక్ జిల్లా మహిళా శిశు సంక్షేమ, వ్యవసాయ, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడిపాడారు. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి, హత్నూరలో ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ఆదరణ లభించిందన్నారు.
– మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, సెప్టెంబర్ 28
నాలుగురోజు బుధవారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆడబిడ్డలంతా తంగేడు, బంతి, చామంతి, గునుగు తదితర పూలు సేకరించి బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం ఆయా గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను ఉంచి ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాము ఆయే సందమామ’ అంటూ తీరొక్క పాటలతో రాత్రి తొమ్మిది గంటల వరకు ఆడిపాడారు. అనంతరం గౌరమ్మకు పూజలు చేసి మంగళహారతులు ఇచ్చారు. ఆ తర్వాత సమీప చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకొని ప్రసాదాలు పంపిణీ చేశారు.
చిన్నశంకరంపేట,సెప్టెంబర్28: ఆస్ట్రేలియా ఖండం బ్రిస్బెన్ నగరంలో బుధవారం తెలంగాణ అసోసియేషన్ ఆధ్యర్యంలో ప్రవాస తెలంగాణ ప్రాంతవాసులు బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు కత్తి కిశోర్ ఉపాధ్యక్షురాలు జనంపల్లి నీలిమా, సెక్రటరీ తూంకుంట విన్నీ, ఈసీ సభ్యులు ఏకే సంతోశ్రావు మాధవి, శ్రీకాంత్, శివానీ, లక్ష్మి, భార్గవి తదితరులు పాల్గొన్నారు.