పాపన్నపేట, ఫిబ్రవరి 20: దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల అటవీ ప్రాంతం ప్రతిధ్వనించింది. ఏడుపాయల జాతరలో అత్యంత కీలక ఘట్టమైన రథోత్సవం సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జాతరలో చివరి కార్యక్రమమైన రథోత్సవాన్ని తిలకించేందుకు చీకటిని సైతం లెక్క చేయకుండా భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. వందలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ తన్మయత్వం పొందారు. జాతరలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగే ఈ కార్యక్రమం రాత్రి 9 గంటలకు ప్రారంభమై 11 గంటలకు ముగిసింది.
కొనసాగిన ఎదుర్కోలు ఆచారం…
అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఏడుపాయల ఆలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్ ఎండోమెంట్ కార్యాలయం నుంచి డప్పు సప్పుళ్లతో రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు. రెవెన్యూ అధికారులను ఆలయ మర్యాదలతో ఎదుర్కొని, అక్కడి నుంచి నేరుగా నాగ్సాన్పల్లి చేరుకొన్నారు. అనాదిగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం గ్రామ పెద్దకాపు అయిన సాయిరెడ్డిని బాజాభజంత్రీలు, డప్పు చప్పుళ్ల మధ్య ఎదుర్కొని, దుర్గమ్మ ఆలయం వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి వనదుర్గాభవానీ మాత ఉత్సవ విగ్రహాన్ని ఎదుర్కొని రథం గోలి వరకు తీసుకొచ్చారు. రథం గోలి సమీపంలో రథం ముందు పట్టు పరిచి అన్నం వంచి రాసిపోసే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో 18 కులాలకు చెందిన పనిపాటల వాళ్లు పాల్గొన్నారు. అనంతరం జయజయధ్వానాలు చేస్తూ రథాన్ని లాగే కార్యక్రమం రథం గోలి ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఇది నేరుగా రాజగోపురం వరకు కొనసాగింది. వేలాది మంది తాళ్లతో రథాన్ని లాగారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించడానికి ఏడుపాయలలో మూడు రోజుల తిష్ట వేసిన భక్తులు చెట్లు, గుట్టలు, బండరాళ్లపై ఎక్కుతూ పోటీపడ్డారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మెదక్ జిల్లా ఎస్పీ రోహిణిప్రియదర్శిని ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. కార్యక్రమం జయప్రదం కావడానికి జిల్లా కలెక్టర్ రాజార్షిషా ఏడుపాయలలోనే ఉండి అనుక్షణం జాతర పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్ అధికారులను సమాయాత్తపరిచారు.
విద్యుత్ దీపాలతో అలంకరణ…
ఏడుపాయలలో రథం గోలి సమీపంలో రథాన్ని రంగురంగుల కాగితాలు, విద్యుద్దీపాలతో మెరిమెట్లు గొలిపేలా అలంకరించారు. ఈ కార్యక్రమం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రశాంతంగా ముగిసింది. దీంతో సంబంధిత అధికారులతో పాటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మాధవానందస్వామికి పూర్ణకుంభ స్వాగతం…
ఏడుపాయల దుర్గాభవానీమాతను తొగుట పీఠాధిపతి మాధవానందస్వామి సోమవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే ఏడుపాయల చేరుకున్న మాధవానందస్వామికి ఆలయ పూజారులు, చైర్మన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దుర్గమ్మను దర్శించుకున్న జిల్లా కలెక్టర్…
జిల్లా కలెక్టర్ రాజార్షిషా సోమవారం ఉదయం వనదుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఏడుపాయల జాతర కలియతిరుగుతూ లోటుపాట్లను పరిశీలిస్తూ ఆలయ కమిటీ చైర్మన్, ఈవోకు, సంబంధిత అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.
కలెక్టర్ వెంట జిల్లాస్థాయి అధికారులు, ఆలయ అధికారులు ఉన్నారు.
విజయవంతమైన అధికారుల సమన్వయం
ఏడుపాయలలో భారీ సంఖ్యలో భక్తులు వస్తారన్న ఉద్దేశం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డితోపాటు కలెక్టర్ రాజార్షిషా ఇతర జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టర్, ఎమ్మెల్యేతో కలసి జాతరకు ముందు పలుమార్లు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ పలుమార్లు జాతరకు ముందు పనులు ఎంతవరకు వచ్చాయంటూ ఏడుపాయలకు చేరుకొని జాతర ప్రాంతం మొత్తం కలియదిరిగారు. పలు సలహాలు సూచనలు సైతం అందించారు. ఉన్నత స్థాయి అధికారులు పలుమార్లు సమీక్ష నిర్వహించడంతో జాతర విజయవంతమయ్యింది. ఏదిఏమైనా అధికారులు ప్రత్యేక చొరవతో జాతర ముగిసింది.
పోటెత్తినభక్తజనం..
మూడు రోజుల పాటు కొనసాగే ఏడుపాయల జాతరకు భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగింది. రెండోరోజైన ఆదివారం బండ్లు తిరిగే కార్యక్రమానికి భక్తులు లక్షలాదిగా హాజరయ్యారు. ఆ భక్తులకు తోడు మూడో రోజైన సోమవారం రథోత్సవాన్ని తిలకించడానికి మరింత మంది విచ్చేశారు. మూడు సంవత్సరాల క్రితం నూతనంగా నిర్మించిన పోతంశెట్టిపల్లి రోడ్డు వైపు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం కనిపించింది. గతంలో ఘనపూర్ ఆనకట్ట వైపు నుంచి అధిక సంఖ్యలో ఏడుపాయలకు భక్తులు చేరుకునేవారు. నూతన రోడ్డు ఏర్పడడంతో పోతంశెట్టిపల్లి వైపు రద్దీ భారీగా పెరిగింది. ఇక నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల వారు మాత్రం నాగ్సాన్పల్లి వైపు నుంచి ఏడుపాయలకు చేరుకున్నారు.