సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 22: పద్యానికి 1200 ఏండ్లు నిండాయని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, కవి చల్లా శ్రీరామచంద్రమూర్తి అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం తారా ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘తెలుగు పద్య సౌందర్యం’ అనే అంశంపై కవి ప్రసంగిస్తూ ప్రాచీన కవిత్వం నుంచి ఆధునిక సాహిత్యం వరకు పద్య సౌందర్యాన్ని వివరించారు. నన్నయ, తిక్కన, ఎర్రన కవుల పద్యాల్లోని చమత్కారాన్ని రూపుకట్టించారు. పద్యంలోని ప్రతి అక్షరానికి ఒక అర్థం ఎలా ఉంటుందనే పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ఎస్ రత్నప్రసాద్ మాట్లాడుతూ.. కవిత్వంతో జ్ఞానం, ఆహ్లాదం, ఆనందం కలుగుతుందన్నారు. సామాజిక బాధ్యత అలవాటవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రవీణ, తెలుగు విభాగాధిపతి డాక్టర్ రాపోలు శ్రీనివాస్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఏవీ శర్మ, అధ్యాపకులు డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ మహంతయ్య, డాక్టర్ సుమతి, జలీల్, ఇతర అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ జల దినోత్సవాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగాలు, వృక్షశాస్త్ర సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. భూమిపై జీవరాశి మనుగడకు ప్రధాన ఆధారం నీరే అని పేర్కొన్నారు. నీరు లేనిదే భూమిపై జీవం లేదన్నారు. భావితరాల కోసం ప్రతి బిందువును కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నీటిని వృథాను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పద్మజ, డాక్టర్ సిద్దులు, డాక్టర్ అభిజిత్, డాక్టర్వెంకటేశం, డాక్టర్ జగదీశ్వర్, శివదీప్తి, విద్యార్థులు పాల్గొన్నారు.