వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులను ప్రభుత్వం సన్మానించనున్నది. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కలెక్టర్లు అవార్డులు ప్రదానం చేయనున్నారు. మెదక్ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఒకరు, జిల్లా స్థాయికి 77 మంది ఎంపికయ్యారు. సంగారెడ్డి జిల్లాలో ముగ్గురిని రాష్ట్ర, 120 మందిని జిల్లాకు ఎంపిక చేశారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తుండడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోనూ టీచర్స్ డేను ఘనంగా నిర్వహించేందుకు యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
– మెదక్ మున్సిపాలిటీ/ సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 4
గోడలపై చిత్రాలతో వినూత్న బోధన
శాకారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న ప్రశాంత్కుమార్ విద్యార్థులకు భిన్నంగా బోధించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు ప్రతి అంశాన్ని ప్రయోగాత్మకంగా బోధిస్తే చిరస్థాయిగా గుర్తిండిపోతాయని నమ్మిన కృషీవలుడు. తోటి ఉపాధ్యాయిని నీరజతోపాటు మరో విద్యావలంటీర్తో కలిపి 72మంది విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాల్లో స్కూల్ గోడలపై ఎనామిల్ పెయింట్తో చిత్రాలు వేయించి తన చదువే.. తన ఎదుగుదలకు రెక్కలు అన్న కాన్సెప్ట్తో ముందుకుసాగుతున్నారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పాత్ర, గ్రామస్తుల తోడ్పాటు తదితర 11 అంశాల్లో జరిగిన పరిశీలనలో బోధనకు 2022 విద్యాసంవత్సరంలో జాతీయస్థాయి మ్యాగ్జిన్లో శాకారం ప్రభుత్వబడికి చోటుదక్కడంలో ప్రశాంత్కుమార్ కృషి జిల్లాస్థాయిలో పనిచేస్తున్న ఉపాధ్యాయలోకాన్ని ఆలోచింపజేసింది.
విద్యార్థుల ఉత్తమ భవిష్యత్కు కృషి
కోహెడ సెప్టెంబర్ 4: మండలంలోని వింజపల్లి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న నేను 2019లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ప్రతిరోజూ విద్యార్థుల ఉత్తమ భవిష్యత్ కోసం ఆలోచిస్తుండడంతోపాటు రిసోర్స్ పర్సన్గా పనిచేస్తుంటా. తోటి ఉపాధ్యాయులకు బోధనలో మెళకువలు తెలియజేస్తూ వైజ్ఞానిక ప్రదర్శనలో పాలపంచుకుంటా. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామపెద్దలు, యువకులు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్ , సీలింగ్ ఫ్యాన్లు, ఇతర సామగ్రిని అందించారు.
– రవివర్మ, ప్రధానోపాధ్యాయుడు, వింజపల్లి ప్రాథమిక పాఠశాల
రాష్ట్రస్థాయి గుర్తింపు బాధ్యతను పెంచింది
2001లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా వర్గల్ మండలంలో ఎంఆర్సీగా విధుల్లో చేరాను. చిన్నతనం నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగాలని అనుకునేవాడిని 2001 జనవరిలో అది నెరవేరింది. టీచర్ ఉద్యోగానికి ముందు లారీ క్లీనర్గా పనిచేశాను. ప్రస్తు తం శాకారం ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంగా పని చేస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయడిగా ప్రకటించడంతో చాలా సంతోషం అనిపించింది. నా తల్లిదండ్రుల కృషి, సాటి ఉపాధ్యాయుల తోడ్పాటు, ముఖ్యంగా శాకారం గ్రామస్తులు అందించిన సహాయ సహకారాలు మరువలేనివి. ఇది వ్యక్తిగతంగా మరోబాధ్యతను తెచ్చిపెట్టింది.
వర్గల్, సెప్టెంబర్ 4: స్కూల్కు రావడం పాఠాలు బోధించడం తిరిగివెళ్లడం ఇది ప్రతి ఉపాధ్యాయుడి దినచర్య. కానీ, వర్గల్ మండలం శాకారం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న ప్రశాంత్కుమార్ మాత్రం ప్రతి పిల్లాడి మనస్తత్వాన్ని దగ్గరుండి గమనించి పిల్లాడికి నచ్చిన రీతిలో బోధిస్తూ ఉత్తమ విద్యార్థులను తయారు చేస్తూ చదువుల సారూ అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఉపాధ్యాయ వృత్తితోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు పెంచడం, తనకు తోచినమేర ఇతరులకు ఆర్థికసాయం చేస్తుండడంతో ఆయన్ను వరాల ప్రశాంత్కుమార్ అని పిలిచేవారు. సిద్దిపేట పట్టణానికి చెందిన వరాల సత్తయ్య,లక్ష్మిల నాలుగో సంతానం అయిన ప్రశాంత్కుమార్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి, అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నవారికి రక్తదానం చేసేవారు. ఇప్పటివరకు 67సార్లు రక్తదానం చేసి ఎందరికో ప్రాణం పోసిన ప్రశాంత్కుమార్ను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దివంగత భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సెప్టెంబర్ 5ను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ప్రకటించింది. దీంతో వర్గల్ మండలం శాకారం గ్రామస్తులు, ఉపాధ్యాయ లోకం హర్షం వ్యక్తం చేశారు.