హుస్నాబాద్, అక్టోబర్ 10: హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడోసారి కూడా హుస్నాబాద్లో జరుగబోయే ఆశీర్వాద సభతో ఎన్నికల శంఖారావం పూరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున ఎన్నికల షెడ్యూల్ తర్వాత మొట్టమొదటి సభ కావడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. లక్ష్మి నియోజకవర్గంగా భావించి హుస్నాబాద్లోనే ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నందున లక్ష మందికి పైగా జనాన్ని సభకు తరలించి సీఎం కేసీఆర్కు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేందుకు నియోజకవర్గంలోని నాయకులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యే సతీశ్కుమార్, స్థానిక నేతలు మంగళవారం హుస్నాబాద్లో పర్యటించి సభాస్థలాలను పరిశీలించారు. మొదట పోతారం(ఎస్) గ్రామ శివారులోని శుభం గార్డెన్ సమీపంలో స్థలాన్ని, అనంతరం కరీంనగర్ రోడ్డులోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో పరిశీలించారు. కరీంనగర్ రోడ్డు సబ్స్టేషన్ సమీపంలోనే సభ నిర్వహించేందుకు నిర్ణయించారు. అనంతరం మంత్రి కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
15వ తేదీన సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభం అవుతుందని, అనుకున్న సమయానికే సీఎం కేసీఆర్ హెలీకాప్టర్ ద్వారా సభాస్థలానికి చేరుకుంటారని ఆయన తెలిపారు. మద్యాహ్నం మూడు గంటల వరకే జనాన్ని సభాప్రాంగణంలోకి తీసుకురావాలని, ఎక్కడ కూడా సభకు వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొదటి ఆశీర్వాద సభ కావడం వల్ల ఆనందోత్సాహాల మధ్య నిర్వహించాలన్నారు. డప్పుల చప్పుళ్లు, కోలాటం ఆటలు, వేషధారణలు, డోలు వాయిద్యాలు, నృత్యాల, బోనాలు, బతుకమ్మలతో ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గ్రామాల్లో ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన వీవో అధ్యక్షులు, వీఆర్ఏలు, ఆర్టీసీ ఉద్యోగులు, రేషన్డీలర్లు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తల సహకారం తీసుకొని అనుకున్నదానికంటే ఎక్కువ మందిని సభకు తరలించేందుకు పార్టీ కేడర్ సన్నద్దం అవుతున్నారు. కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉన్నందున నేతలు ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు.