చేర్యాల, జనవరి 16 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో సోమవారం దేవాదాయ ధర్మదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్వామివారి క్షేత్రానికి వచ్చిన కమిషనర్ మొదటగా మల్లన్న క్షేత్రంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మల్లన్న జాతర, బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు, పాలక మండలి కల్పించిన వసతులు, చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గుట్టపై ఉన్న శ్రీ రేణుకా (ఎల్లమ్మ ) ఆలయాన్ని సందర్శించారు. అక్కడి నుంచి బండగుట్ట, దాసరం గుట్ట తదితర ప్రదేశాల వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న 50 కాటేజీల నిర్మాణాలతో పాటు దాసరం గుట్టపైకి వేస్తున్న బీటీరోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. మహామండపంలో ఒగ్గు పూజారులతో పట్నం వేయించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ సర్కారు ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మల్లన్న ఆలయానికి సంబంధించిన ఆర్జిత సేవలను 15 రోజుల్లో ఆన్లైన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. తడకల పందిళ్లు లేకుండా శాశ్వతంగా షెడ్స్ ఏర్పాటు చేయిస్తామన్నారు. క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలో నిధులు విడుదల చేస్తామన్నారు.
దాసరం గుట్ట కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల సేవే లక్ష్యంగా అధికారులు, పాలక మండలి విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఏ.బాలాజీ, పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఏఈవో వైరాగ్యం అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పాలక మండలి సభ్యులు సూటిపల్లి బుచ్చిరెడ్డి, నర్రా రఘువీర్రెడ్డి, ఆలయ సిబ్బంది, ఒగ్గు పూజారులు ఉన్నారు.
దేవాదాయశాఖ కమిషనర్కు వినతి : ఆలయ చైర్మన్ కుర్చీలో చైర్మన్ కుమారుడిని కూర్చోబెట్టి కుర్చీని అవమానించిన విషయంలో విచారణ చేపట్టాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు దేవాదాయశాఖ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సీపీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, సర్పంచ్ తాడూరి రవీందర్, సనాది భాస్కర్, ఉల్లంపల్లి సాయిలు, బాలకిషన్, రవీందర్ ఉన్నారు.