అమీన్పూర్,ఫిబ్రవరి 13: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో బీరంగూడ గుట్టపై వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాడు. శివరాత్రి సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు 17 నుంచి 21 తేదీ వరకు జరుగనున్నాయి. ఏర్పాట్లను పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈనెల 8న జాతర ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులతో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతర విజయవంతానికి సూచనలు చేశారు.
బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కనుల పండువగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. దేవాలయం ముందు భారీ షెడ్డు వేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. గుట్టపై వెళ్లడానికి రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఆలయ ఆవరణలో వ్యాపారులు షాపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నది. ఏర్పాట్లను అమీనపూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత పర్యవేక్షిస్తున్నారు.ఉత్సవాలకు మంత్రులు హరీశ్రావు, ఇంద్రకరణ్రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మండలి ప్రొటెం మాజీ స్పీకర్ భూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఆలయ ఈవో శశిధర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏనుగు తులసిరెడ్డి తెలిపారు.
పూజా కార్యక్రమాలు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున శుక్రవారం ఉదయం ఆలయ ప్రదక్షిణ, గణపతిపూజ, పుణ్యహవాచనం, అఖండ దీపారాధన, ధ్వజారోహణం, నవగ్రహారాధన, రుత్విక్ వరుణ అంకురారోహణ, నాందీ సమారాధన, మహాన్యాస పూర్వక ఏకవారాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చనతో పాటు స్వామివారికి బిల్వార్చన, హారతి, పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి.
18న మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ధర్మ దర్శనం, మహామండపంలో ప్రత్యేక పూజలు, నవగ్రహ పూజ, హనుమత్ పూజ, అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చన, హారతి, మంత్రపుష్పం, లింగోద్భవ సమయంలో స్వామి వారికి ఏకవార రుద్రాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి.
19న నిత్యపూజ, స్వామి వారికి రుద్రాభిషేకం, అనంతరం ఉదయం 10.45 గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణం, సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తారు.
20న నిత్యపూజ, స్వామివారికి రుద్రాభిషేకం, ఉదయం 10.00 గంటలకు స్వామి వారి వసంతోత్సవం, శివ సహస్రనామ స్తోత్ర పారాయణం, స్వామివారికి భస్మాలంకరణ, బిల్వార్చన, పల్లకీసేవ, తీర్థప్రసాద వితరణ ఉంటుంది.
చివరి రోజైన 21న స్వామి వారికి పంచామృతాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, పూర్ణాహుతి ,రుత్వికులకు సన్మానం, అనంతరం స్వామివారి పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
లోటుపాట్లు రానీయం..
మున్సిపల్ పరంగా జాతరకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాలను విజయవంతం చేయడానికి నిత్యం పర్యవేక్షిస్తున్నాం. భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో పారిశుధ్యం లోపం లేకుండా చర్యలు చేపడతాం. తగిన సిబ్బందిని సమకూర్చి అందుబాటులో ఉంచు తాం. ఆలయ సిబ్బందితో కలిసి జాతర విజయవంతానికి మావంతుగా పూర్తిగా సహకరిస్తాం. భక్తుల సౌకర్యార్ధం వైద్యం శిబిరం ఏర్పాటు చేస్తాం.
–తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ అమీన్పూర్
ప్రారంభం కానున్న జాతర..
మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జాతర ప్రారంభమవుతుంది. తెల్ల్లవారుజాము నుంచి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. భక్తులు భారీగా హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలి.
–శశిధర్, ఆలయ ఈవో