కొండాపూర్, ఏప్రిల్ 1: పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం కొండాపూర్ మండల మఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు భూటకమన్నారు. ఎన్నికల్లో కార్యకర్తలందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. అదే తరహాలో వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మరింత ఉత్సాహంతో పని చేసి మెదక్ ఎంపీగా వెంకట్రామిరెడ్డిని ఆదరించి, భారీ మెజార్టీతో గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తారని చెప్పారు. మెదక్ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కానుకగా ఇవ్వాలన్నారు.
గెలిచిన నెలరోజుల్లో రూ.100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, పేదలు ఉచితంగా పెండ్లీలు చేసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానన్నారు. 40 రోజులు నావెంట నడిస్తే జీవితకాలం మీ వెంటే ఉంటానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. భవిషత్తు బీఆర్ఎస్దేనని, కేవలం 2శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల సహకారంతో దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్దేనన్నారు. గెలుపోటములు సహజమని, కార్యకర్తలు కుంగిపోకుండా ముందుకు సాగి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు సమస్యలు, రైతుల సాగునీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. సంగారెడ్డిలో తనకు అణువణువు తెలుసని, ఎంపీగా గెలిస్తే పరిపాలన అనుభవతంతో ఇక్కడి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. వేలాది కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంలో ట్రస్టు ద్వారా పేద విద్యార్థులకు కోచింగ్, యువతకు వృత్తి నైపుణ్యం కోర్సుల ఏర్పాటు చేస్తానన్నారు. యువతకు శిక్షణ అందించి జాబ్ మేళా ద్వారా ఉపాధి అవకాశం కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, మాజీ ఎంపీపీ రాజేశ్వర్రావు దేస్పాండే, పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకం విఠల్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, బీఆర్ఎస్ నాయకులు మల్లాగౌడ్, నగేశ్, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.