గజ్వేల్, మార్చి 20: రీజినల్ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)నిర్మాణానికి తమ సాగు భూములు ఇవ్వబోమని బుధవారం గజ్వేల్ ఐవోసీ కార్యాలయం ఎదుట మర్కూక్ మండలం నర్సన్నపేట, చెబర్తి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. ఆ రెండు గ్రామాల మీదుగా ఆర్ఆర్ఆర్ పోతున్న నేపథ్యంలో రైతులతో ఆర్డీవో బన్సీలాల్ సమావేశం ఏర్పాటు చేసి భూసేకరణపై మాట్లాడారు. రైతులకు పరిహారం విషయంపై చర్చించారు. ఎకరాకు రూ.7లక్షలు చెల్లిస్తామని, అందుకు రైతులు అంగీకరించాలని కోరడంతో రైతులు అంగీకరించకుండా ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు భీంరెడ్డి రాంరెడ్డి, ఎంబరి వెంకటేశం, రాంరెడ్డి, ఉడేం శివారెడ్డి మాట్లాడుతూ..
గత ప్రభుత్వ హయాంలో అధికారులు చేసిన మొదటి అలైన్మెంట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ నిర్మించాలని, అందుకు అధికారులు తమ గ్రామాన్ని ఎంచుకోవద్దన్నారు. గుంట భూమి అమ్మితే రూ.7లక్షలు వస్తాయని, అలాంటిది ఎకరాకు రూ.7లక్షలు ఇస్తామంటే నష్టపోతామన్నారు. తమ గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం చేయాలనుకుంటే భూమికి భూమి, ఎకరానికి 500 గజాల ప్లాట్ ఇవ్వాలన్నారు. వ్యవసాయ భూములు తీసుకుంటే తమ బతుకుదెరువు ఎలా? అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.