కొండపాక(కుకునూరుపల్లి), ఏప్రిల్ 16: కలెక్టర్ కావాలనే సంకల్పం ముందు పేదరికం ఓడింది. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. ఆ కుటుంబంలో విద్యావంతులు పెద్దగా లేరు. అయితేనేమీ పేదరికాన్ని సైతం ఎదిరించి ఐఏఎస్ సాధించి సత్తాచాటాడు సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన బుద్ది అఖిల్యాదవ్. 2021లో మొదటి ప్రయత్నంలోనే 566 ర్యాంకు సాధించాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఓవైపు ఢిల్లీలో ట్రైనీ ఐపీఎస్గా విధులు నిర్వర్తిస్తూనే ఐఏఎస్ లక్ష్యంగా శ్రమించాడు. 2023 సెప్టెంబర్లో యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యాడు. 2024 జనవరిలో ఇంటర్వ్యూకు హాజరైన బుద్ది అఖిల్యాదవ్, మంగళవారం వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 321వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు.