దుబ్బాక, నవంబర్ 29: సుమారు రెండు దశాబ్దాలుగా అక్బర్పేట-భూంపల్లి ప్రజల కల సాకారమైంది. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చోరువతో అక్బర్పేట-భూంపల్లి కొత్త మండలంగా అవతరించింది. ఉమ్మడి మెదక్ జిల్లాగా ఉన్న సమయంలో జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి వెళ్లేందుకు సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ప్రజలు భూంపల్లి మీదుగా వెళ్లేవారు. సిద్దిపేట నుంచి సంగారెడ్డికి ఎక్స్ప్రెస్ బస్లను మాత్రం నడిపేవారు. అవి కూడా 3, 4 బస్లు మాత్రమే. దుబ్బాక నియోజకవర్గం ప్రజలు సంగారెడ్డికి వెళ్లాలంటే భూంపల్లి చౌరస్తాకు వచ్చేవారు. దీంతో భూంపల్లి చౌరస్తాకు ప్రత్యేకత ఉండేది.
చౌరస్తా నుంచి 2 కి.మీ దూరంలోనే కూడవెల్లి రామలింగేశ్వరాలయం ఉండడంతో నిత్యం జనసందడితో కిటకిటలాడుతుండే. భూంపల్లి చౌరస్తాగా పిలువబడే ప్రాంతం అక్బర్పేట గ్రామపంచాయతీలో ఉంటుంది. అక్బర్పేట, భూంపల్లి గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. మొదట భూంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అక్బర్పేట, కూడవెల్లి గ్రామాలు మధీర గ్రామాలుగా ఉండేవి. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో అక్బర్పేట, కూడవెల్లి గ్రామపంచాయతీలుగా మారాయి.
భూంపల్లి, అక్బర్పేట రెండు గ్రామాలు కలిసిపోవడంతో అభివృద్ధి జోరందుకుంది. గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూంపల్లిలో రెండు దశాబ్దాల కిందటే కూడవెల్లి వాగు పక్కన భూంపల్లి పోలీసుస్టేషన్ను ఏర్పాటు చేశారు. భూంపల్లిలో పోలీసు స్టేషన్, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ముందుగానే ఉండడంతో వీటికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణం కోసం ఇబ్బంది లేకుండాపోయింది.
శాంతిభద్రతలు, వైద్య, ఆరోగ్యపరంగా ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వసతులున్నాయి. ప్రభుత్వ పరిపాలనతో పాటు ప్రజలకు సేవలందించేందుకు ముందుగా రెవెన్యూ కార్యకలాపాలు నిర్వహించేందుకు తహసీల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. నేటి నుంచి అక్బర్పేట-భూంపల్లి మండలం పేరిట ప్రజలకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో అక్బర్పేట-భూంపల్లి మండల ప్రజలలో హర్షాతిరేకాలు నెలకొన్నాయి.
నియోజకవర్గంలో 8వ మండలంగా..
దుబ్బాక నియోజకవర్గంలో కొత్తగా మరో మండలం పురుడు పోసుకోవడంతో మండలాల సంఖ్య ఎనిమిదికి చేరింది. మారుతున్న కాలంతో పాటు దుబ్బాక నియో జకవర్గ భౌగోళికంగా ఎన్నో రకల మార్పు చెందింది. గతంలో రాజగోపాల్పేట, అనంతరం దొమ్మాట నియోజకవర్గంగా ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ప్రస్తుత దుబ్బాక నియోజకవర్గంలో సిద్దిపేట, మెదక్ జిల్లాలతో కూడిన భౌగోళిక స్వరూపం ఉంది.
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్ మండలాలుండగా, మెదక్ జిల్లాలోని చేగుంట, నార్సింగ్ మండలాలున్నాయి. దీంతో దుబ్బాక నియోజకవర్గంలో రెండు జిల్లాల పాలన కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా, దుబ్బాక నియోజకవర్గంలో మండలాల ఏర్పాటుతో అంతర్గత భౌగోళిక మార్పు అవుతునే ఉంది. 2016లో దుబ్బాక నియోజకవర్గంలో 5 మండలాలుండేవి. దౌల్తాబాద్ మండలంలో ఉన్న కొన్ని గ్రామాలతో కొత్తగా రాయపోల్ మండలంగా, చేగుంట మండలంలో పలు గ్రామాలతో నార్సింగ్ మండలంగా ఏర్పాటు జరుగడంతో మండలాల సంఖ్య 7కు చేరింది. ప్రసుత్తం అక్బర్పేట-భూంపల్లి మండలం ఏర్పాటుతో నియోజకవర్గంలో ఎనిమిది మండలాలతో కూడిన దుబ్బాక నియోజకవర్గ ముఖచిత్రంలో మార్పు కానున్నది.
తహసీల్ కార్యాలయాన్ని పరిశీలించిన ఎంపీ, అదనపు కలెక్టర్
మిరుదొడ్డి, నవంబర్ 29 : అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన నూతన తహసీల్ కార్యాలయాన్ని మంగళవారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. బుధవారం మంత్రి హరీశ్రావు తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, తహల్దార్ ఉదయ శ్రీ, డిప్యూటీ తహసీల్దార్ వీరేశ్, సర్పంచ్ ధర్మారం స్వరూప భిక్షపతి, పార్టీ సీనియర్ నాయకుడు రొట్టె రాజమౌలి, దుబ్బాక ఏఎంసీ చైర్మన్ కైలాసం, సర్పంచ్ రాజయ్య, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రవి, దుబ్బారాజం, శ్రీరాములు, మల్లారెడ్డి, నరేశ్, కృష్ణ, ప్రభాకర్, శ్రీనివాస్, జన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా ఏర్పడిన అక్బర్పేట-భూంపల్లి మండలం దుబ్బాక నియోజకవర్గానికి తలమానికంగా మారునున్నది. నియోజకవర్గంలోని దుబ్బాక, మిరుదొడ్డి మండలాలకు చెందిన 13 రెవెన్యూ గ్రామాలు, 19 గ్రామపంచాయతీలతో అక్బర్పేట-భూంపల్లి మండలంగా ఏర్పడింది. ఈ మండలంలో దుబ్బాక మండలంలోని 5 రెవెన్యూ గ్రామాలు (పోతారెడ్డిపేట, చౌదర్పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్, చిట్టాపూర్), 9 గ్రామపంచాయతీలు (పోతారెడ్డిపేట, రామేశ్వరంపల్లి, నగరం, చిన్ననిజాంపేట, తాళ్లపల్లి, చౌదర్పల్లి, ఎనగుర్తి, బొప్పాపూర్, చిట్టాపూర్) చేరాయి.
మిరుదొడ్డి మండలంలోని 8 రెవెన్యూ గ్రామాలు (భూంపల్లి, ఖాజీపూర్, కూడవెల్లి, వీరారెడ్డిపల్లి, జంగాపల్లి, అల్మాస్పూర్, రుద్రారం, మోతె), 10 గ్రామపంచాయతీలు(భూంపల్లి, అక్బర్పేట, కూడవెల్లి, బేగంపేట, ఖాజీపూర్, జంగాపల్లి, వీరారెడ్డిపల్లి, అల్మాస్పూర్, రుద్రారం, మోతె) గ్రామపంచాయతీలతో మండలంగా ఏర్పడింది. ఈ మండలంలో సూమారు 26 వేల ఎకరాల విస్తీర్ణం, 7వేల కుటుంబాలు(ఇండ్లు), 30 వేల జనాభాతో ఏర్పడింది. సిద్దిపేట-రామాయంపేట పట్టణాలకు సెంటర్ పాయింట్గా భూంపల్లి చౌరస్తా ఉంటుంది. భూంపల్లి చౌరస్తా నుంచి రామయంపేట 25 కి,మీ దూరం ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేటకు భూంపల్లి నుంచి 25 కి.మీ దూరం ఉండడం గమనార్హం. అతి స్వల్ప సమయంలో భూంపల్లి అభివృద్ధిలో దూసుకపోతుంది.
మండల ప్రజలకు శుభాకాంక్షలు
తెలంగాణ అంటేనే సీఎం కేసీఆర్. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశంలో నెంబర్ వన్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కింది. పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ నూతనంగా జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లాలో కొత్తగా అక్బర్పేట-భూంపల్లి, కుకునూరుపల్లి మండలాలు ఏర్పాటు కావడం చాలా సంతోషం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జిల్లాలతో పాటు మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పాలనతో పాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. దుబ్బాక నియోజకవర్గంలో అక్బర్పేట-భూంపల్లి మండ లం ఏర్పాటు కోసం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు సహకారం మరిచిపోలేనిది. బుధవారం భూంపల్లిలో తహసీల్దార్ కార్యాలయం మంత్రి హరీశ్రావు చేతులమీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం మరింత సంతోషంగా ఉంది. మండల ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు.
– కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎంపీ టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు
అక్బర్పేట-భూంపల్లి ప్రజల దశాబ్ధాల కల
అక్బర్పేట-భూంపల్లి మండలమనేది ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అది నెరవేరింది. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కృషి ఫలితంగానే కొత్త మండలం ఏర్పడింది. ప్రజలకు ఎన్నో రకల సమస్యలకు పరిష్కారం లభించింది. ఇప్పటి వరకు మిరుదొడ్డి, దుబ్బాక మండల కేంద్రాలకు వెళ్లేందుకు ప్రజలు పలు రకాల ఇబ్బందులు పడ్డారు. నూతన మండలం ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన పాలనతో పాటు గ్రామాలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. మా మండల ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బక్కి వెంకటయ్య, డీసీసీబీ డైరెక్టర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి