సిద్దిపేట కలెక్టరేట్, అక్టోబర్ 7: అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజావాణిలో వచ్చే అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి సూచించారు. సోమవారం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు.
జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించారు. భూ సంబంధిత, ఇండ్లు, ఆసరా పింఛన్లపై 22 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్వో లక్ష్మీకిరణ్,డీఆర్డీవో జయదేవ్ఆర్యా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.