సోషల్ మీడియా ద్వారా సోషల్ సర్వీస్
సమస్య తెలుసుకోవడం సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేయడం
లక్షలాది రూపాయల సహాయం చేసిన యువకులు
అనాథలను సంరక్షణ కేంద్రాలకు తరలించేందుకు చర్యలు
చేర్యాల, జూన్ 24 : చేర్యాలకు చెందిన నలుగురు యువకులు సోషల్ మీడియా ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థపెరిగి ప్రపంచమే కుగ్రామంగా మారిన తరుణంలో ఎవరి పనిలో వారు బిజీ, బిజీగా గడుపుతున్న క్రమంలో చేర్యాల పట్టణానికి చెందిన బుక్క సతీశ్ (సాఫ్ట్వేర్ ఇంజినీర్), ఐతా రాము, తహీర్, ఐతా శంకర్ సోషల్మీడియా ద్వారా ఇతరులకు సహాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. యూత్ క్లబ్ ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించడం, నాయకుల పుట్టిన రోజు వేడుకలు చేస్తున్న ఈరోజుల్లో కేవలం ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు నలుగురు యువకులు ముందుకు వచ్చి గత సంవత్సరం నుంచి సేవలు చేస్తున్నారు. యూత్ సభ్యులు తమ సేవలను కేవలం చేర్యాల పట్టణం, మండలానికే కాకుండా ఇతర జిల్లాల వారికి సైతం అందిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
రోడ్డుపై గుంతలు వారిలో ఆలోచన రేకెత్తించింది
భారీగా కురిసిన వర్షాలతో చేర్యాల పట్టణంలోని రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడుతున్న విషయాన్ని గుర్తించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బుక్క సతీశ్ రోడ్డు ఫొటో తీసి అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్కు పోస్టు చేశాడు. దానిని గమనించిన అదనపు కలెక్టర్ రోడ్డు పై ఉన్న గుంతలు పూడ్చివేయించడమే కాకుండా మీరు పోస్టు చేసిన సమస్యను పరిష్కరించానని తిరిగి సతీశ్కు మెసేజ్ చేశాడు. దీనికి ఇంప్రెస్ అయిన సతీశ్ తన స్నేహితులైన రాము, తహీర్, శంకర్తో సోషల్ మీడియా ద్వారా రోజువారి జీవితంలో తమ దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి సదరు యువకులు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ వేదికగా తమ దృష్టికి వచ్చిన సమస్యలు తెలుసుకొని ఫలానా వారు ఆర్థికంగా సమస్య ఎదుర్కొంటున్నారని, వారికి తోచిన విధంగా సహాయం చేద్దామని వారి వారి స్టేటస్, ఫేస్బుక్లో గూగుల్పే, ఫోన్ పే తదితర వాటిల్లో తమ బ్యాంకు ఖాతా నంబర్లు పోస్టు చేసేవారు. సమస్యను తెలుసుకున్న వ్యక్తులు, దాతలు వారికి పంపించిన డబ్బులను బాధితులకు అందజేస్తున్నారు.
మూడున్నర లక్షలకు పైగా అందజేసిన యువకులు
చేర్యాల మండలంలోని మాసిరెడ్డిపల్లికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి రూ.5వేలతో గ్యాస్స్టవ్తో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన చిన్నపిల్లలు తండ్రిని కోల్పోవడంతో వారికి రూ.52వేలు తపాలా కార్యాలయంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పత్రాలు వారికి ఇచ్చారు. జగదేవ్పూర్కు చెందిన పేద కుటుంబానికి రూ.8వేలతో పాటు నిత్యావసర సరుకులు, కొమురవెల్లి మండలంలోని కిష్టపేటకు చెందిన ఓ యువకుడికి యాక్సిడెంట్ కావడంతో సర్జరీ కోసం రూ.40వేలు, ధూళిమిట్ట మండల కేంద్రానికి చెందిన ఓ పేద కుటుంబానికి రూ.10వేలు, చేర్యాల మండలంలోని కడవేర్గుకు చెంది చిన్నబాబు గుండె సర్జరీ నిమిత్తం రూ.70వేలు అందజేశారు. చేర్యాల పట్టణానికి చెందిన పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోవడంతో వారి పేరుమీద రూ.63వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. చేర్యాల మండలం వేచరేణికి చెందిన మహిళకు యాక్సిడెంట్ కావడంతో ఆపరేషన్ నిమిత్తం రూ.24,300, వీరన్నపేటకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్కు రోడ్డు ప్రమాదం జరగడంతో ఆయన సర్జరీ కోసం రూ.16వేలు అందజేశారు. చేర్యాల ప్రగతి స్కూల్కు చెందిన మల్లేశం అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడికి యాక్సిడెంట్ కావడంతో ఆయన సర్జరీ కోసం రూ.38,000, చేర్యాల పట్టణానికి చెందిన అల్లం సురేశ్ అనే యువకుడికి రోడ్డు ప్రమాదం కావడంతో సర్జరీ కోసం రూ.20వేలు అందజేశారు. చేర్యాలకు చెందిన దివ్యాంగులు తల్లిని కోల్పోవడంతో వారిని సంరక్షణ కేంద్రంలో చేర్పించారు.
సమస్య తెలియజేస్తూ సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్కు ట్విట్ చేసిన సతీశ్ (ఫైల్)
సేవ చేయడంలో నిజమైన ఆనందం
కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో నిజమైన ఆనందం ఉంటుంది. ‘తిన్నామా..పడుకున్నామా..నిద్రలేచామా’ అనే ధోరణిలో కాకుండా మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా సేవలు అందించాలని నిర్ణయించుకున్నాం. సమస్యను గుర్తించి మిత్రులు రాము, తహీర్, శంకర్కు తెలియజేయగా, వారు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. తద్వారా వచ్చిన డబ్బులను బాధితులకు అందజేస్తున్నాం. సామాజిక మాధ్యమాలతో పాటు తాము సహాయం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమ స్నేహితులకు ఫోన్ చేస్తున్నారు. దీంతో తాము స్పందించి వారికి సహాయం చేస్తున్నాం. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతాం.
–బుక్క సతీశ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్