న్యాల్కల్, డిసెంబర్ 24: కొండా కోనలు.. పచ్చని పొలాల మధ్య స్వయంభూగా వెలిసిన రేజింతల్ సిద్ధివినాయక స్వామి 223వ జయంతోత్సవాలు శనివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పువ్వులు, కొబ్బరి, మామిడితోరణాలతో ఆలయ పరిసరాలు, గర్భగుడిని అందంగా అలంకరించారు. కంచికామ పీఠం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేదపండితులు ఆలయంలో ఉదయం వేదఘోషం, దీపప్రజ్వలన, ధ్వజారోహణం, స్వస్తి పుణ్యాహ వచనం, అభిషేకం, దేవతా ఆహ్వానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన బల్వంత్రెడ్డి కుటుంబసభ్యులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వివిధ రకాల లక్ష పుష్పాలతో స్వామివారికి పుష్పాభిషేకం చేశారు. అనంతరం వేదపండితుల వేదమంత్రోచ్ఛారణాల మధ్య అలయ కమిటీ సభ్యులతో యాగశాల ప్రవేశం చేశారు. ఆదివారం నుంచి యాగశాలలో ప్రారంభం కానున్న హోమాల కోసం 54 యజ్ఞ గుండాలను ఏర్పాటు చేశారు. ఈ హోమాల్లో పాల్గొనేందుకు దాదాపు 250 మందికిపైగా దంపతులు హాజరుకానున్నారు.
ఇందుకోసం యాగశాలలో చేపట్టనున్న శతచండీ, 2100 ఆవర్తనముల గణపత్యథర్వ శీర్షహోమాలు, గణేశ గాయిత్రీ హోమాల కోసం వేదపండితులు అగ్ని మథనాన్ని చేపట్టారు. అనంతరం యాగశాలలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి జయంతోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్ రేజింతల్, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింహులు, ఉపాధ్యాక్షుడు రమేశ్పాండే, కోశాధికారి నీల రాజేశ్వర్, సెక్రటరీ ఉల్లిగడ్డ బస్వరాజ్, కమిటీ సభ్యులు అల్లాడి వీరేశం, గణేశ్దీక్షిత్, కోబ్బజీ రవికుమార్, కల్వ చంద్రశేఖర్, సిద్దప్ప, చంద్రశేఖర్, అశోక్, మేనేజర్ కృష్ణ, వేదపండితులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.