ఢిల్లీ ,జూన్ 22: స్టాక్ మార్కెట్లో మరో ఏడాది పాటు బుల్ హవా ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.ప్రస్తుతం ఇండియన్ బుల్ మార్కెట్ 2003-08లోని ధోరణికి అద్దం పడుతుందని వెల్లడించింది. గత ఏడాది మార్చి నెలలో నమోదయిన కనిష్ఠస్థాయి నుంచి బుల్ మార్కెట్ ప్రారంభమైందని, ఇది ఇంకా కొంతకాలం కొనసాగుతుందని తాజా నివేదికలో తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు షేర్ల వ్యాల్యూను లెక్కించే సమయంలో ప్రైస్ ఈర్నింగ్ నిష్పత్తి కంటే ప్రైస్ టు బుక్ వ్యాల్యూను(పీబీవీ) పరిగణనలోకి తీసుకోవడం మేలు అని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది.
బుల్మార్కెట్లో గరిష్ఠంగా సగటు పీబీవీ5.2 వరకు నమోదయినట్లు, ప్రస్తుతం ఇది 3.6 మాత్రమే ఉన్నట్లు తెలిపింది. గతంలో నాలుగు సందర్భాల్లో సగటున బుల్ మార్కెట్ 72 వారాలు ఉన్నట్లు, ప్రస్తుత బుల్ మార్కెట్ 64 వారాలు పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది. 2003-08 మార్కెట్ ధోరణి ఇప్పుడు కనిపిస్తోందని, అప్పుడు 246 వారాలు కొనసాగిందని, ఇప్పుడు కూడా మరో ఏడాది పాటు దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ హవా కొనసాగ వచ్చుని అంచనా వేసింది. సమీప భవిష్యత్తులో వినియోగ వస్తువులు, ఉత్పత్తిరంగ పరిశ్రమలు, ఆర్థిక సేవల రంగాల కంపెనీలు మెరుగైన ఆదాయాలు నమోదు చేస్తాయని భావిస్తున్నట్లు వివరించింది.