చేర్యాల, డిసెంబర్ 4 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండింది. స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20 వేల మందికి పైగా భక్తులు కొమురవెల్లికి తరలివచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. స్వామి వారి సన్నిధిలో తమ మొక్కు లు తీర్చుకునేందుకు భక్తులు శనివారం ఉదయం నుంచే మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు.అనంతరం ఆలయ నిర్వహణలో ఉన్న గదులతో పాటు ప్రైవేటుగా ఉన్న గదులు రెంట్కు తీసుకుని బస చేశారు.
ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో పవిత్ర స్నానం అచరించి, నేరుగా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు అర్చన, ప్రత్యేక పూజలు, కేశఖండన, నజరు, మహామండప, చిలుక ప ట్నం, బోనం, టెంకాయలు, హుండీల్లో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. మరి కొందరు భక్తులు తమ మొక్కులు తీర్చాలని గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, సంతానం కలగాలని మరికొందరు ఒల్లు బండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామి వారిని వేడుకున్నారు. భక్తులకు మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, డైరెక్టర్లు కొంగరి గిరిధర్, సూటిపల్లి బుచ్చిరెడ్డి, రఘువీర్రెడ్డి, కాసర్ల కనకరాజు, కందుకూరి సిద్దిలింగం, చెట్కూరి తిరుపతి, సాయియాదవ్, గడ్డం మహేశ్యాదవ్, నామిరెడ్డి సౌజన్య, సూపరింటెండెంట్లు నీల శేఖర్, శ్రీనివాస్శర్మ, ఆలయ సిబ్బంది, ఒగ్గు పూజారులు సేవలు అందించారు.